NTV Telugu Site icon

CM Chandrababu Delhi Tour: ఢిల్లీలో సీఎం చంద్రబాబు బిజీ బిజీ.. నేడు ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులతో భేటీ..

Babu 2

Babu 2

CM Chandrababu Delhi Tour: రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. బిజీ బిజీగా గడుపుతున్నారు.. నేడు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.. ఈ రోజు సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని మోడీతో భేటీకానున్న ఆయన.. సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో సమావేశం కానున్నారు.. ఇక, రాత్రి 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీకానున్నారు సీఎం చంద్రబాబు నాయుడు..

ఇక, తొలిరోజు (నిన్న రాత్రి) కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర జలశక్తి మంత్రి, ఏపీ ముఖ్యమంత్రి, “కేంద్ర జల సంఘం”, జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, ఏపీ ఉన్నతాధికారులు గంటకు పైగా సమావేశం అయ్యారు. సత్వరమే పోలవరం నిర్మాణ పనులను ప్రారంభించేందుకు అనుసరించాల్సిన కార్యాచరణపై చర్చలు జరిగాయి.. కొత్తగా పెరిగిన నిర్మాణ పనులను ప్రస్తుతం నిర్మాణ పనులను చేస్తున్న నిర్మాణ సంస్థకే ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు..

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు.. కరవు రహిత రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దే శక్తి పోలవరం ప్రాజెక్టుకు ఉంది. 2019-2024 జగన్ పాలనలో 20 నుంచి 30 శాతం పోలవరం వెనక్కి పోయిందని విమర్శించారు.. కేంద్ర జల సంఘం, మంత్రిత్వశాఖ అధికారులతో కీలక సమావేశం గంటకు పైగా సాగింది. “డయా ఫ్రమ్” వాల్ ను కొత్తగా నిర్మించాలని నిర్ణయం జరిగింది. 2022 టెండర్ లో 3,090 కోట్ల రూపాయల మేరకు పనులు దక్కించుకున్న నిర్మాణ సంస్థకే కొత్త పనులు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు.. అప్పటి ధరలకే నిర్మాణ పనులు చేసేందుకు అంగీకరించడంతో, కొత్త పనులు కూడా ఆ సంస్థ కే ఇవ్వాలనే నిర్ణయించామని.. పోలవరం నిర్మాణం సత్వరమే, నిర్దిష్టమైన సమయం మేరకు పనులు కొనసాగాలని పేర్కొన్నారు. 73 వేల చదరపు మీటర్ల మేరకు నిర్మాణ పనులు పెరిగాయి. కుడి కాలువ ద్వారా, కృష్ణా నది కి గోదావరి జలాలు అందేలా చేయాలన్నదే లక్ష్యంగా తెలిపారు మంత్రి నిమ్మల రామానాయుడు.