CM Chandrababu Davos Visit: రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు.. అసలు లక్ష్యం అదే..!

  • రేపు దావోస్‌కు సీఎం చంద్రబాబు..
  • 4 రోజుల పాటు సీఎం చంద్రబాబు పర్యటన..
  • ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న చంద్రబాబు..
Cbn

Cbn

CM Chandrababu Davos Visit: ఆంధ్రప్రదేశ్‌కి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా.. ఇప్పటికే పలు మార్లు విదేశీ పర్యటనలకు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. రేపు దావోస్ పర్యటనకు బయల్దేరనున్నారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ పర్యటనలో ప్రపంచ ఆర్థిక సదస్సు (వరల్డ్ ఎకనామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సులో తొలి రెండు రోజుల పాటు సీఎం చంద్రబాబు 20కు పైగా దేశాల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించనున్నారు.

Read Also: Kangana : మీలాంటి ద్వేషపూరితమైన వ్యక్తిని చూడలేదు.. రెహమాన్’పై కంగనా సంచలనం

ఇక, 4 రోజుల పర్యటనలో మొత్తం 36 కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నట్లు అధికారులు తెలిపారు. ఐబీఎం (IBM), గూగుల్ క్లౌడ్, ఏపీ మోలర్ మెర్క్స్ వంటి ప్రముఖ సంస్థల సీఈవోలతో సీఎం చంద్రబాబు ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. అలాగే స్విట్జర్లాండ్, యూఏఈతో పాటు పలు దేశాల ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో ఐటీ, పరిశ్రమలు, గ్రీన్ ఎనర్జీ, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను సీఎం చంద్రబాబు అంతర్జాతీయ వేదికపై వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ పర్యటన జరగనుందని అధికారులు తెలిపారు. దావోస్ పర్యటన పూర్తయ్యాక ఈ నెల 23న సీఎం చంద్రబాబు అమరావతికి తిరిగి రానున్నారని వెల్లడించారు.