AP Cabinet: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది.. సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం.. ముఖ్యంగా.. ఎంతోకాలంగా ఎదురుచూస్తోన్న మహిళలకు శుభవార్త చెప్పబోతోంది ప్రభుత్వం.. రేపు కేబినెట్ సమావేశంలో మహిళల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై చర్చించబోతున్నారు.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించి అధికారికంగా పేరు ఖరారు చేసి ప్రకటన చేయనుంది ప్రభుత్వం.. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా చర్చించనున్నారు.. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ లో చర్చిస్తారు.. ఎల్ఆర్ఎస్.. బీఆర్ఎస్ పై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.. సీఎం అండ్ టీం సింగపూర్ టూర్ పై చర్చించనుంది మంత్రివర్గం.. ఇక, కేబినెట్ సమావేశం తర్వాత తాజా పరిణామాలపై సీఎం చంద్రబాబు మంత్రులతో చర్చించనున్నారు.. లిక్కర్ కేసులు.. నగదు బయట పడడం.. అరెస్ట్ లకు సంబంధించి కూడా చర్చించనున్నారు..
Read Also: MG Hector, Astor: ఎంజీ కళ్లు చెదిరే ఆఫర్స్.. ఆ మోడల్స్ పై రూ. 2.30 లక్షల డిస్కౌంట్
మరోవైపు, ప్రతిష్టాత్మక పీ4 కార్యక్రమంపై ఈ రోజు సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, పీ4 ఫౌండేషన్ వైస్ ఛైర్మన్ కుటుంబరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్లు జూమ్ కాల్ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు. కాగా, స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలోని మహిళలందరికి ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించేందుకు సిద్ధమైంది కూటమి ప్రభుత్వం.. దీనిపై ఇప్పటికే అధికారులు ఎక్సైజ్ పూర్తి చేశారు.. అంతర్రాష్ట్ర పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు జీరో టికెట్తో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటున్నారు.. మహిళా ఉద్యోగులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ సౌకర్యం కల్పించబోతున్నారు.. మొత్తం బస్సుల్లో 74 శాతం బస్సులున్న పల్లె వెలుగు, అల్ర్టా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ కేటగిరీ బస్సుల్లో ఈ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నామని ఇప్పటికే రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వెల్లడించారు.. ఆధార్, ఓటర్ ఐడీ, రేషన్ కార్డుల్లో ఏదైనా ఒకటి చూపించినా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది.
