AP Cabinet Meeting: ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు.. ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్, నేతన్నలకు భరోసా..

Ap Cabinet

Ap Cabinet

AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయం, నీటిపారుదల, ఉద్యోగాల కల్పన, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంపై ఎల్ నినో ప్రభావం ఉండే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం సాగులో ఉన్న పంటల వివరాలు, ప్రధాన జలాశయాల్లో ఉన్న నీటి నిల్వలు, తాగునీరు, సాగునీటి లభ్యతపై సమగ్ర నివేదికను వెంటనే సమర్పించాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రులకు కూడా సూచించారు.

ఉద్యోగాల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 3,168 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఆమోదం తెలిపింది. అలాగే చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ ‘నేతన్న భరోసా’ పథకం కింద 52 వేల చేనేత కుటుంబాలకు ఏటా రూ.25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ సరఫరాతో పాటు అదనపు ఆర్థిక సహాయం ప్రకటించినందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎన్డీయే ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

విద్యారంగంలో భాగంగా బాపట్లలో వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే రానున్న పుష్కరాల సందర్భంగా భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.50 కోట్లు మంజూరు చేశారు. రైతుల ప్రయోజనాల కోసం ఏపీ మార్క్‌ఫెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నుంచి లభించే రూ.300 కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ ఇవ్వడానికి కూడా క్యాబినెట్ అంగీకారం తెలిపింది కేబినెట్‌..

ఇక మధ్యాహ్నం మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన జరిగే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ (జీఓఎం) సమావేశంలో రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన అంశంపై విస్తృతంగా చర్చించనున్నారు. అనంతరం సాయంత్రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని పర్యటన ఏర్పాట్లపై మంత్రులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. రాష్ట్ర అభివృద్ధి, వ్యవసాయ భద్రత, సంక్షేమం, ఉపాధి కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని తాజా మంత్రివర్గ నిర్ణయాలు స్పష్టం చేస్తున్నాయి.