AP Weather Alert: వాతావరణ హెచ్చరిక.. 10 జిల్లాల్లో వర్షాలు, పలు ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు

Ap Weather Alert

Ap Weather Alert

AP Weather Alert: ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి.. రాబోయే 24 గంటల్లో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర ఎండలు, వడగాల్పులు ప్రభావం చూపనున్నాయని తెలిపింది. ప్రస్తుతం విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ద్రోణి విస్తరించి ఉందని అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

అలాగే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. పిడుగులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద లేదా హోర్డింగ్స్ కింద నిలబడవద్దని హెచ్చరించింది. రైతులు, పశుకాపరులు పొలాల్లో పని చేస్తున్న సమయంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపిస్తే వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించింది. వర్షపు గాలుల కారణంగా విద్యుత్ వైర్లు తెగిపడే ప్రమాదం ఉన్నందున వాటికి దూరంగా ఉండాలని పేర్కొంది.

×
×
Ad

ఇక మరోవైపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తీవ్ర ఎండలు కొనసాగనున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

వడగాల్పుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండనున్నట్లు APSDMA తెలిపింది. శ్రీకాకుళం జిల్లాలో 7 మండలాలు, విజయనగరం జిల్లాలో 6 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. అదనంగా 28 మండలాల్లో సాధారణ వడగాల్పులు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. ఇక నేడు నమోదైన గరిష్ఠ ఉష్ణోగ్రతల విషయానికి వస్తే.. నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 44.9 డిగ్రీలు, ప్రకాశం జిల్లా కొండపిలో 44.6 డిగ్రీలు, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.5 డిగ్రీలు, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 43.4 డిగ్రీలు, మార్కాపురం జిల్లా కంభం మరియు ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 43.3 డిగ్రీలు, కృష్ణా జిల్లా నందివాడలో 42.9 డిగ్రీలు, గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వర్షాలు, పిడుగులు, వడగాల్పులు ఒకేసారి ప్రభావం చూపనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.