Site icon NTV Telugu

Andhra Pradesh: లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులు తయారీ.. టార్గెట్‌గా పెట్టుకున్న సర్కార్..

Cbn

Cbn

ఆంధ్రప్రదేశ్‌లో లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఈ దిశగా ప్రారంభించిన అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు అనూహ్య స్పందన లభిస్తుండటంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఈ కోర్సు కోసం దాదాపు 50 వేల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారని సీఎం వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ (X) వేదికగా స్పందించారు. ఏపీని క్వాంటం టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు.

Read Also: Uttarakhand: కాంగ్రెస్ ఎమ్మెల్యే కుమారుడిపై దాడి.. ఐసీయూలో చేరిక

ఐఐటీ మద్రాస్‌, ఐబీఎం రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఎన్‌పీటీఈఎల్ (NPTEL) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అడ్వాన్స్‌డ్ క్వాంటం స్కిల్లింగ్ కోర్సుకు ఇంత పెద్ద సంఖ్యలో నమోదు కావడం రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అత్యుత్తమ నైపుణ్యాలు కలిగిన లక్ష మంది క్వాంటం కంప్యూటింగ్ నిపుణులను తయారు చేయాలన్న లక్ష్యం దిశగా ఇది కీలక అడుగు అని చంద్రబాబు తెలిపారు. క్వాంటం రంగంలో దీర్ఘకాలిక పెట్టుబడులు, ఆవిష్కరణలు, పరిశోధనలకు ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ గమ్యస్థానంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. క్వాంటం స్కిల్లింగ్ కోర్సులో బంగారు, వెండి పతకాలు సాధించే నిపుణులను స్వయంగా సత్కరించేందుకు ఎదురు చూస్తున్నానని సీఎం స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఈ కోర్సు పూర్తి చేసినవారే క్వాంటం కంప్యూటింగ్ రంగంలో గ్లోబల్ లీడర్లుగా ఎదిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..

Exit mobile version