High Court: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. విశాఖపట్నం సమీపంలోని అడవి వరం, ముడసరిలోవ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్న అదానీ డేటా సెంటర్కు సంబంధించిన భూ కేటాయింపుల వ్యవహారంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత కంపెనీలకు నోటీసులు జారీ చేసింది. విశాఖపట్నం జిల్లాలో సుమారు 480 ఎకరాల ప్రభుత్వ భూమిని, సుమారు రూ.5,000 కోట్ల విలువైన భూమిని, అదానీ గ్రూప్కు చెందిన రైడ్ అండ్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు ఉచితంగా కేటాయించడాన్ని సవాలు చేస్తూ అనకాపల్లి జిల్లాకు చెందిన జై భీమ్ భారత్ పార్టీ (JBP) జిల్లా అధ్యక్షుడు నేతల నాగేశ్వరరావు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (PIL) దాఖలు చేశారు.
Read Also: KTR: స్పీకర్ తీరు ప్రజాస్వామ్యానికి మచ్చ.. ఇది రాజ్యాంగానికే గొడ్డలి పెట్టు..
ఈ పిల్పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీర సింగ్ ఠాకూర్, జస్టిస్ చల్లా గుణరంజన్ల ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై పలు కీలక ప్రశ్నలు సంధించింది. రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 40 (తేదీ 11-10-2025) ద్వారా భూమితో పాటు రూ.1000 కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించిందని, అనంతరం జీవో ఎంఎస్ నెంబర్ 66 (తేదీ 02-12-2025) ద్వారా 480 ఎకరాల భూమిని తక్షణమే బదలాయించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. పిటిషనర్ తరఫున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ప్రకారం కంపెనీలకు భూమిని ఉచితంగా బదలాయించే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. జీవో ఎంఎస్ నెంబర్ 117 (తేదీ 09-11-2023) ప్రకారం భూమిని కేవలం లీజు పద్ధతిలో మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఉందని తెలిపారు.
ఇక, పరిశ్రమ పూర్తయ్యాకే భూ బదలాయింపు జరగాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ముందుగానే సేల్ డీడ్ రాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం భూమిపై తన పూర్తి హక్కులను కోల్పోతుందని న్యాయవాది హెచ్చరించారు. ఒకసారి సేల్ డీడ్ రాసి ఇస్తే, ప్రాజెక్టు పూర్తికాకపోయినా భూమిని తిరిగి స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉండదని వాదించారు. ఈ నేపథ్యంలో, ఏ పాలసీ ఆధారంగా భూమిని ఉచితంగా బదలాయిస్తున్నారు?, ఈ జీవోల ప్రకారం ఇప్పటికే సేల్ డీడ్లు రాశారా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని తీవ్రంగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. భూ బదలాయింపుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసిన న్యాయస్థానం, ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రంలో భూ కేటాయింపులు, పరిశ్రమలకు ఇచ్చే ప్రోత్సాహకాలపై కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.