AP Heatwave Alert: ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు ప్రభావం చూపనున్నాయని, దాదాపు వారం రోజుల పాటు హీట్వేవ్స్ కొనసాగనున్నాయని అధికారులు తెలిపారు. ప్రత్యేకంగా రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 నుంచి 47 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తేమ శాతం తగ్గిపోవడంతో పొడిగాలుల ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుంది. దీంతో ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని సూచిస్తున్నారు.
ఇక, ఈ నెల 19న మయన్మార్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు. అయితే దాని ప్రభావం తక్షణంగా రాష్ట్రంపై కనిపించే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశముందని చెబుతున్నారు. వైద్య నిపుణులు కూడా ప్రజలకు కీలక సూచనలు చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో బయట తిరగకుండా ఉండటం, ఎక్కువగా నీరు తాగడం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ప్రజలు వడదెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
