Adimulapu Suresh: దమ్ముంటే.. ఆ వీడియో మాధవ్‌దేనని నిరూపించాలి

Adimulapu Suresh

Adimulapu Suresh

Adimulapu Suresh Responds On Goratala Madhav Video Call Issue: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ శనివారం స్పందించారు. మాధ‌వ్‌కు చెందిన‌దిగా చెబుతున్న ఆ వీడియో మార్ఫింగ్ చేసిన‌దేన‌ని ఆయ‌న వెల్లడించారు. మాధ‌వ్‌పై టీడీపీ నేత‌లు అన‌వస‌ర రాద్ధాంతం చేస్తున్నార‌ని.. ద‌మ్ముంటే ఆ వీడియో మాధ‌వ్‌దేన‌ని నిరూపించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. వీడియో వ్యవ‌హారంపై పూర్తి స్థాయిలో విచార‌ణ జ‌రిపి… దానిని సృష్టించిన ఐ-టీడీపీకి చెందిన వ్యక్తుల‌పై చ‌ర్యలు తీసుకోవాల‌ని ఆదిమూలపు సురేశ్ డిమాండ్ చేశారు. దోషులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో వైసీపీకి, సీఎం జగన్‌కు పెరుగుతున్న జనాదరణ చూసి.. టీడీపీ నాయకులకు దిక్కతోచడం లేదన్నారు. రాష్ట్ర ప్రజలు తిరస్కరిస్తున్నా.. టీడీపీ నేతలకు బుద్ది రావటం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. గోరంట్ల మాధన్ న్యూడ్ వీడియో కాల్ ఎపిసోడులో, అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించిన నివేదికను టీడీపీ విడుదల చేసింది. ఈనెల 9న ఆ వీడియోని పంపించామని.. నిన్న నివేదిక వచ్చిందని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి అన్నారు. ఎంపీపై చర్యలు తీసుకోకుండా సీఎం జగన్ వెనకేసుకొస్తున్నారని.. ఫోరెన్సిక్ నివేదిక లేకుండానే మార్ఫింగ్ అని ఎలా తేలుస్తారని ఆయన ప్రశ్నించారు. వీడియో ఎడిటింగ్ చేసింది కాదని ఎక్లిప్స్ ల్యాబ్స్ తేల్చిందన్నారు. ఈ నివేదిక ఆధారంగా మాధవ్‌తో రాజీనామా చేయించి, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత సైతం మాధవ్‌పై మండిపడ్డారు. గలీజు వ్యవహారాన్ని కులానికి ఆపాదించడం నిజంగా సిగ్గుచేటని.. ప్రభుత్వం సహా పోలీసులు సైతం మాధవ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోరెన్సిక్ నివేదికపై చర్చించే దమ్ము పోలీసులకు, ప్రభుత్వానికి ఉందా? అంటూ సవాల్ విసిరారు.