Woman Gave Birth on The Train Track: రైలులో ప్రయాణిస్తున్న సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఓ మహిళ రైలు పట్టాలపైనే ప్రసవించిన ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. ఒడిశా రాష్ట్రం బరంపుర్కు చెందిన ప్రియాపాత్ర అనే మహిళ బరంపుర్ నుంచి సూరత్కు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైలులో ప్రయాణిస్తోంది.. అయితే, రైలు ప్రయాణంలో ప్రియాపాత్రకు తీవ్రమైన పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం రైల్వే స్టేషన్ వద్ద రైలు నుంచి దించారు. ఇక, అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగానే, రైల్వే పట్టాలపైనే ఆమె ప్రసవించింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆటో ద్వారా ప్రియాపాత్రను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆమెకు అవసరమైన చికిత్స అందించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తూ, స్థానికులు సమయానికి సహకరించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు.
Read Also: SA20 2026: అభిమానికి గాయం.. క్షమాపణతో పాటు సంతకం చేసిన జెర్సీ గిఫ్ట్..!