Tomato Price Crash: పార్వతీపురం మన్యం జిల్లాలో టమాటా ధరలు దారుణంగా పతనమవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లో టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో రైతులు నష్టాల్లో కూరుకుపోయారు. ప్రస్తుతం 28 కేజీల టమోటా కేటును వ్యాపారులు 120 నుంచి 150 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు. ఖర్చులతో పోలిస్తే ఈ ధరలు చాలా తక్కువగా ఉండటంతో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాలూరు మండలంలో సుమారు 300 ఎకరాల వరకు టమాటా పంటను సాగు చేస్తున్నారు. అయితే, దిగుబడి బాగా వచ్చినప్పటికీ సరైన ధర లేకపోవడం అన్నదాతలను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తోంది.
Read Also: Budget Smartphones: కేవలం రూ.10000 లోపు బెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్స్ ఇవే..
ఇంకా రాబోయే రోజుల్లో టమాటా పంట ధర మరింత తగ్గే అవకాశం ఉందేమోనని రైతులు భయపడుతున్నారు. ఇప్పటికే టమాటా ఏరిన కూలీలకు చెల్లించాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నామని కర్షకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమకు మద్దతు ధర ప్రకటించి, రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. ధర ఇలాగే, కొనసాగితే తమ జీవితాలు అప్పుల్లో కూరుకుపోతాయని చెప్పుకొచ్చారు.
