సామాన్యుడికి ధరల సెగ తగిలితే ఆవేదన వస్తుంది, కానీ ఒక రెస్టారెంట్ యజమానికి మాత్రం అద్భుతమైన సెటైర్ వేయాలనే ఆలోచన వచ్చింది. మహారాష్ట్రలోని పుణెలో ఉన్న ఒక హోటల్ యజమాని, వంట గ్యాస్ (LPG) ధరల పెరుగుదలపై పెట్టిన ఒక ఫన్నీ బోర్డు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కస్టమర్లను నవ్వించడమే కాకుండా, అంతర్జాతీయ రాజకీయ పరిణామాలను సామాన్యుడి వంట గదికి ముడిపెట్టిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
బోర్డుపై ఏముందంటే?.. సాధారణంగా రెస్టారెంట్ బయట ‘ఈరోజు స్పెషల్’ వంటకాల పేర్లు ఉంటాయి. కానీ, ఈ హోటల్ యజమాని మాత్రం ధరల పట్టిక పక్కన ఒక వెరైటీ బోర్డు పెట్టారు. అందులో “వంట గ్యాస్ ధరల పెరుగుదలకు, ఇరాన్-ఇజ్రాయెల్, యూఎస్ యుద్ధానికి, మధ్య ప్రాచ్య దేశాల్లో నెలకొన్న ఉద్రిక్తతలకు ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి రేట్లు ఎందుకు పెరిగాయని మమ్మల్ని అడగకండి.. ఎక్కువ రేట్ కు ఫుడ్ తినండి లేకుండా యుద్ధాన్ని ఆపండి ” అని రాశారు.
ఈ బోర్డు ఫోటోను ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది. “నిజమే కదా.. హోటల్ యజమాని పాయింట్ కరెక్ట్” అని కొందరు కామెంట్ చేస్తుంటే, “ధరలు పెరిగినా కనీసం నవ్వుకోవడానికైనా ఒక కారణం దొరికింది” అని మరికొందరు నవ్వుకుంటున్నారు. గ్యాస్ ధరల వల్ల హోటల్ తిండి ప్రియమవుతున్న తరుణంలో, యజమాని తన అసహనాన్ని ఇలా హాస్యంతో జోడించి చెప్పడం విశేషం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, సహజ వాయువు ధరలు పెరగడం వల్ల దేశీయంగా ఎల్పీజీ ధరలు ప్రభావితమవుతుంటాయి. ఈ విషయాన్ని సామాన్యుడికి అర్థమయ్యేలా, కాస్త వెటకారం జోడించి చెప్పిన ఈ పుణె హోటల్ యజమాని ఐడియా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
