Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!

  • రైలు కింద పిల్లలను కాపాడిన తల్లి
  • సమష్టిపూర్ స్టేషన్‌లో ఉత్కంఠ ఘటన
  • వైరల్ వీడియోపై నెటిజన్ల ప్రశంసలు
  • ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ లేకపోవడంపై విమర్శలు
Viral Video

Viral Video

Mother Saves Children Under Moving Train in Bihar Viral Video : అమ్మ అంటే ప్రేమ మాత్రమే కాదు.. అవసరమైతే మృత్యువుతో పోరాడే ధైర్యం కూడా అని ఒక ఘటన నిరూపించింది. తన కళ్లెదుటే మృత్యువు రైలు రూపంలో దూసుకొస్తున్నా, ఏమాత్రం భయపడకుండా తన బిడ్డలను గుండెలకు హత్తుకుని ప్రాణాలతో బయటపడింది ఒక వీరమాత. ఒళ్లు గగుర్పొడిచే ఈ హృదయ విదారక ఘటన బిహార్‌లోని సమష్టిపూర్ జిల్లాలో చోటుచేసుకుంది.

సమష్టిపూర్ జిల్లా షాపూర్ పటోరి రైల్వే స్టేషన్‌లో ముగ్గురు మహిళలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రైల్వే ట్రాక్ దాటుతున్నారు. సరిగ్గా అదే సమయంలో అత్యంత వేగంతో ఒక రైలు ఆ ట్రాక్ మీదికి దూసుకొచ్చింది. ప్లాట్‌ఫారమ్ ఎక్కేలోపే రైలు దగ్గరకు వచ్చేయడంతో ఏం చేయాలో పాలుపోని ఆ మహిళలు, ప్లాట్‌ఫారమ్‌కు , ట్రాక్ పక్కన ఉన్న ఇరుకైన గ్యాప్‌లో దూరిపోయారు.

రైలు వేగంగా వెళ్తున్నా, ఆ కంపనలకు బిడ్డలు భయపడి బయటకు రాకుండా ఒక తల్లి వారిద్దరినీ తన గుండెలకు హత్తుకుని పడుకుంది. రైలు పెట్టెలన్నీ వెళ్లే వరకు ఆమె తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను కాపాడుకుంది. చూస్తున్న వారంతా ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు. రైలు వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో సహా అందరూ సురక్షితంగా బయటపడటంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఒక మహిళకు స్వల్ప గాయాలయ్యాయి.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ తల్లి ధైర్యసాహసాలపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే అదే సమయంలో రైల్వే అధికారుల తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్ దాటేందుకు వంతెన (Foot Over Bridge) సదుపాయం లేకపోవడంతోనే ప్రయాణికులు ఇలా ప్రాణాలను హస్తగతం చేసుకుని ట్రాక్‌లు దాటాల్సి వస్తుందని వారు మండిపడుతున్నారు.

మృత్యువు ముంగిట నిలబడి కూడా తన బిడ్డలను కాపాడుకున్న ఆ తల్లి సాహసం చూసి “అమ్మ కంటే గొప్ప యోధులు ఎవరూ ఉండరు” అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ, రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.