NTV Telugu Site icon

Viral video: ఎమర్జెన్సీ వార్డులో డాక్టర్‌పై రోగి బంధువుల దాడి.. వీడియో వైరల్

Doctorattack

Doctorattack

ఆస్పత్రి అంటే కొన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఇక ఎమర్జెన్సీ వార్డు అయితే మరిన్ని జాగ్రత్తలు ఉంటాయి. ఎవరిని పడితే వారిని లోపలికి రానివ్వరు. అంతేకాకుండా లోపలికి చెప్పులు వేసుకుని రానివ్వరు. రోగికి ఇన్ఫెక్షన్లు అంటకుండా వైద్యులు జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవన్నీ పేషెంట్లకు అర్ధం కాదు. చెప్పినా వినరు. ఇదంతా ఎందుకంటారా? అత్యవసర వార్డులోకి చెప్పులు వేసుకురావొద్దన్నందుకు ఏకంగా వైద్యుడిపైనే రోగి బంధువులు ఇష్టానురీతిగా దాడి చేశారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గుజరాత్‌లోని భావ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తలకు గాయమైన మహిళ చేరింది. ఎమర్జెన్సీ వార్డులో ఆమెకు నర్సు ట్రీట్‌మెంట్ చేస్తోంది. ఇంతలో అక్కడికి డాక్టర్ జైదీప్‌సిన్హ్ వచ్చారు. అక్కడ రోగి బంధువులు చెప్పులతో ఉండడం గమనించి.. బయటకు వెళ్లమని చెప్పారు. దీంతో ఒక్కసారిగా రెచ్చిపోయిన పేషెంట్ బంధువులు.. వైద్యుడిపై భౌతికదాడికి దిగారు. ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మహిళా రోగి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో అక్కడ ఉన్న మందులు కిందపడిపోయాయి. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.

డాక్టర్‌పై దాడి చేసే ముందు నిందితులు తీవ్ర ఘర్షణకు దిగారు. మంచంపై పడుకున్న మహిళ, గదిలో ఉన్న నర్సింగ్ సిబ్బంది జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ వారు అతనిని కొడుతూనే ఉన్నారు. ఘర్షణలో గదిలోని మందులు, ఇతర పరికరాలు దెబ్బతిన్నాయి.

సమాచారం అందుకున్న పోలీసులు.. ఆస్పత్రికి చేరుకుని దాడికి పాల్పడిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హిరేన్ దంగర్, భవదీప్ దంగర్, కౌశిక్ కువాడియాలను సెక్షన్‌లు 115 (2) (ఎవరికైనా హాని కలిగించే ఉద్దేశ్యంతో చర్య), 352 (శాంతి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.