Site icon NTV Telugu

నా క్రమశిక్షణకు విష్ణు వారసుడు: మోహన్ బాబు

Manchu Vishnu

Manchu Vishnu

‘మా’ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడింది. అటు ప్రకాశ్ రాజ్, ఇటు విష్ణు పానెల్స్ పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. రెండు ప్యానల్స్ కి మద్దతుగా గళం విప్పుతున్నవారు ఉన్నారు. తాజాగా తన కుమారుడు మంచు విష్ణుకి ఓటు వేయాలని అభ్యర్ధిస్తూ మోహన్ బాబు ఓ ప్రకటన విడుదల చేశారు. తన క్రమశిక్షణకు, కమిట్ మెంట్ కి విష్ణు వారసుడని చెబుతూ తను ఇక్కడే ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా పక్కన నిలబడతాడనే హామీని ఇస్తున్నానని, విష్ణుతో పాటు పూర్తి ప్యానెల్ కి ఓటు వేసి సమర్ధవంతమైన పాలనకు సహకరించాలని కోరారు మోహన్ బాబు.

Read Also : ప్రకాష్ రాజ్ పై కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

తను మా అధ్యక్ష పదవిలో ఉన్నపుడే వృద్ధాప్య ఫించన్లు ప్రవేశపెట్టిన సంగతి గుర్తు చేస్తూ మా అధ్యక్ష పదవి అంటే కిరీటం కాదని, బాధ్యత అని అంటున్నారాయన. ఇండస్ట్రీలో ఎవరి ఏ కష్టం వచ్చినా తనున్నానని ముందు నిలబడ్డ దాసరి నారాణరావు గారి అడుగుజాడల్లో నడుస్తున్న వాడినని, 1982లో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ స్థాపించిన రోజు నుంచి ఇప్పటి వరకూ సినిమాలు నిర్మిస్తూ కొత్త కొత్త సాంకేతిక నిపుణులను, కళాకారులను పరిచయం చేయటమే కాకుండా 24 క్రాప్ట్స్ లో ఉన్న వారి పిల్లలకు తను స్థాపించిన విద్యా సంస్థలలో ఉచితంగా విద్యా సౌకర్యాలు కల్పించానని, ఇకపై కూడా అది కొనసాగుతుందని చెప్పారు మోహన్ బాబు. ఓటును ఆలోచించి అందరి బాగు కోసం తాపత్రయపడుతున్న తన కుమారుడు మంచు విష్ణు ప్యానెల్ కి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నారు మోహన్ బాబు.

Exit mobile version