Fuel price: మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య ఘర్షణలు మదురుతున్నాయి. ఈ యుద్ధ వాతావరణంతో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పాకిస్థాన్, శ్రీలంక లాంటి దేశాలను సంక్షోభం కుదిపేస్తోంది. ఇప్పటికే ఆయా దేశాల్లో ఇంధనంతో పాటు నిత్యవసర వస్తువుల రేట్లు ఆకాశాన్నంటాయి. భారత్లో మాత్రం ప్రస్తుతానికి ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇంధన కొరత నేపథ్యంలో ఒక వేళ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. మధ్యతరగతి వ్యక్తులపై ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే మొట్ట మొదట వాహనదారులకు ఖర్చులు తడిసి మోపెడు అవుతాయి. పెట్రోల్, డీజిల్ ధరల వల్ల నెలవారీ బడ్జెట్ అస్తవ్యస్తమవుతుంది. ఈ ముప్పు కేవలం వాహనదారులకే పరిమితం కాకుండా, ప్రజా రవాణా (బస్సులు, ఆటోలు) ఛార్జీలు పెరగడానికి కూడా దారితీస్తోంది. తద్వారా సొంత వాహనం లేని వారు సైతం ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది. వాహనాల విక్రయాలపై ఇంధన ధరల ప్రభావం కనిపిస్తుంది. దీంతో ఆటోమొబైల్స్ రంగం సైతం కుదేలవుతుంది. ఆటోమొబైల్ రంగంలో డిమాండ్ తగ్గి, వాహనాల తయారీ సంస్థలతో పాటు వాటికి విడిభాగాలు సరఫరా చేసే లక్షలాది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSMEs) నష్టపోతాయి. డిమాండ్ పడిపోవడం వల్ల ఈ రంగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కోతలకు దారితీసే ప్రమాదం ఉంటుంది.
ఇంధన ధరల పెరుగుదల వల్ల కలిగే అతిపెద్ద ‘చైన్ రియాక్షన్’ రవాణా ఖర్చులు ఒక్కసారిగా ఆకాశాన్నంటుతాయి. దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వస్తువుల సరఫరాకు డీజిల్ తప్పనిసరి. లారీలు, ఇతర రవాణా వాహనాల యజమానులు సరుకు రవాణా ఛార్జీలు(Freight Charges) పెంచేస్తారు. దీనివల్ల మనం రోజూ వాడే కూరగాయలు, పండ్లు, పాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతాయి. మీరు ఆర్డర్ చేసే ఫుడ్ నుంచి కొనే ప్రతి వస్తువు వరకు అన్ని రేట్లు పెరుగుతాయి. డీజిల్ ధరలు పెరిగితే అది నేరుగా ద్రవ్యోల్బణానికి (Inflation) దారితీస్తుంది. ధరలు పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. దీనివల్ల మార్కెట్లో వినియోగం తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవడంలో జాప్యం జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇంధన ధరలు ఇలాగే కొనసాగితే అది దేశ ఆర్థిక వృద్ధిని మందగింపజేస్తుంది.