Cockroach Janata Party: గత మూడు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ ఎక్స్ (ట్విట్టర్), ఇన్స్టాగ్రామ్లలో ఒక విచిత్రమైన పేరు మార్మోగిపోతోంది. అదే “కాక్రోచ్ జనతా పార్టీ” (Cockroach Janata Party – CJP). కేవలం 72 గంటల వ్యవధిలోనే ఈ (Satirical) రాజకీయ కూటమి దేశవ్యాప్తంగా లక్షలాది మంది యువతను ఆకర్షించడమే కాకుండా, ఇన్స్టాగ్రామ్లో ఏకంగా 20 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించి రికార్డు సృష్టించింది. ఇంటర్నెట్లో ప్రస్తుతం “నిరుద్యోగులు, సోమరుల అధికారిక గొంతుక”గా ఐడెంటిటీ తెచ్చుకున్న ఈ డిజిటల్ పార్టీ వెనుక ఉన్న సూత్రధారి 30 ఏళ్ల అభిజీత్ దీప్కే.
ఎవరీ అభిజీత్ దీప్కే?
మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) కు చెందిన అభిజీత్ దీప్కే సాధారణ యువకుడు కాదు. ఆయన ఒక ప్రొఫెషనల్ పొలిటికల్ కమ్యూనికేషన్స్ వ్యూహకర్త. పూణే నుంచి జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసిన అభిజీత్, ఆ తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లారు. ప్రతిష్టాత్మక బోస్టన్ విశ్వవిద్యాలయం నుంచి పబ్లిక్ రిలేషన్స్ (PR)లో మాస్టర్ ఆఫ్ సైన్స్ (MS) పట్టా పొందారు. రాజకీయ సందేశాలను సోషల్ మీడియాలో వైరల్ చేయడంలో అభిజీత్కు సుదీర్ఘ అనుభవం ఉంది. 2020 – 2022 మధ్య ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సోషల్ మీడియా బృందంలో కీలక వాలంటీర్గా పనిచేశారు. ముఖ్యంగా 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఆప్’కు అనుకూలంగా వచ్చిన ట్రెండింగ్ మీమ్స్ వెనుక ఈయనే ఉన్నట్లు టాక్. గతంలో ఢిల్లీ విద్యా శాఖకు కమ్యూనికేషన్స్ సలహాదారుగా కూడా బాధ్యతలు నిర్వహించారు.
సుప్రీంకోర్టు వ్యాఖ్య.. ‘కాక్రోచ్ పార్టీ’ ఆవిర్భావం
పలు నివేదికల ప్రకారం.. సుప్రీంకోర్టు చేసిన ఒక వ్యాఖ్యే ఈ సరికొత్త డిజిటల్ ఉద్యమానికి కారణమైందని చెబుతున్నారు. మే 15న దొంగ డిగ్రీల కేసు విచారణ సందర్భంగా.. కొంతమంది నిరుద్యోగులు బొద్దింకల వలె చట్టం, మీడియా, ఆర్టీఐ (RTI) వంటి వ్యవస్థల్లోకి చొరబడుతున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఈ వ్యాఖ్యలు దొంగ డిగ్రీ సర్టిఫికెట్స్ ఉన్నవారిని ఉద్దేశించినవే తప్ప నార్మల్ యూత్ను కాదని తర్వాత కోర్టు స్పష్టం చేసినప్పటికీ, అప్పటికే నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. నీట్ (NEET) పేపర్ లీక్, పెరుగుతున్న నిరుద్యోగం వంటి అంశాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న యువత పల్స్ను అభిజీత్ సరిగ్గా పసిగట్టారు. మే 16న ఎక్స్ వేదికగా “బొద్దింకలన్నీ ఏకమైతే ఏమవుతుంది?” అని సరదాగా పోస్ట్ చేస్తూ.. ‘బొద్దింక జనతా పార్టీ’ పేరుతో ఒక వెబ్సైట్, గూగుల్ ఫామ్ను లైవ్లోకి తెచ్చారు.
ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ‘ది వీక్’ కథనం ప్రకారం.. ఈ పార్టీలో చేరడానికి అభిజీత్ పెట్టిన కండిషన్స్ ‘జెన్-జి’ (Gen-Z) యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
నిరుద్యోగిగా ఉండటం
విపరీతమైన సోమరితనం ప్రదర్శించడం
రోజుకు 24 గంటలూ ఇంటర్నెట్లోనే గడపడం మొదలైన విచిత్రమైన రూల్స్ పెట్టడంతో యువత దీనికి తొందరగా కనెక్ట్ అయిపోయారు.
ప్రస్తుతం ఈ ఉద్యమానికి రాజకీయ వర్గాల నుంచి కూడా సపోర్ట్ వస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) నాయకులు మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి వారు కూడా సోషల్ మీడియాలో ఈ కాన్సెప్ట్కు సపోర్ట్ తెలిపారు. కేవలం ఒక ‘జోక్’గా స్టార్ట్ అయిన ఈ బొద్దింక జనతా పార్టీ (CJP), ప్రస్తుతం దేశంలో పేపర్ లీక్లు, నిరుద్యోగ సమస్య, యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడిపై గళమెత్తే ఒక ప్రధాన పొలిటికల్ డిబేట్గా మారి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
It’s 1 lakh 60 thousand now.
Just wanted to let you all know. https://t.co/7zR43YUylp
— Cockroach Janta Party (@CJP_2029) May 19, 2026
