హైదరాబాద్ డ్రైనేజీల ముంపు సమస్యకు చక్కని పరిష్కారం చూపించాడో నెటిజన్. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీటి వ్యర్ధాలు నేరుగా కాలువల్లోకి కలిసి పోకుండా ఆయా కాలనీల నుంచి ప్రధాన కాలువల్లోకి వచ్చే చోట నెట్ లాంటిది తగిలించాల్సిన అవసరం వుంది. ఈ వ్యర్ధాలు అందులో వుండిపోతాయి. మురుగునీరు మాత్రం బయటకు పోతుంది.
ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు అన్నీ ఈ నెట్లో వుండిపోవడం వల్ల ఇతర ప్రాంతాల్లో కాలుష్యం జరగకుండా వుంటుంది. అవి నిండిపోయాక వాటిని తీసి పారేయవచ్చు. తిరిగి కొత్త నెట్ ఏర్పాటుచేయవచ్చని నెటిజన్ సూచించాడు. ఈ టెక్నాలజీ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేయడంతో పాటు జీహెచ్ఎంసీ, మంత్రి కేటీఆర్, కమిషనర్ జీహెచ్ఎంసీలను ట్యాగ్ చేశాడు. నెటిజన్ సూచనలను అధికారులు పరిశీలించి ప్రశంసించారు. ఇంజనీర్లతో చర్చించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు రిప్లై ఇచ్చారు.