డిసెంబర్ 8న తమిళనాడులో జరిగిన హెలికాఫ్టర్ దుర్ఘటన దేశాన్ని కుదిపేసింది. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మృతుల్లో సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన సతీమణి కూడా ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరులోని కమాండ్ ఆసుపత్రిలో వరుణ్ చికిత్స పొందుతున్నారు. ఆయన పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని డాక్టర్లు చెబుతున్నారు.
ఇదిలా వుంటే వరుణ్ సింగ్ గతంలో రాసిన ఒక లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాను చదివిన హర్యానాలోని ఆర్మీ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్కు సెప్టెంబర్లో వరుణ్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. తాము సాధారణం అని భావించే విద్యార్థుల్లో ప్రేరణ నింపేందుకే ఈ లేఖ రాసినట్లు వరుణ్ సింగ్ పేర్కొన్నారు. తమిళనాడులో హెలికాఫ్టర్ దుర్ఘటన సమయంలో ఈ లేఖ ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ లేఖ చదివిన వారంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.
మీ లక్ష్యం ఏంటో మీరు గుర్తించండి. దేని కోసం పనిచేసినా.. మీ వంతు కృషి చేయండి. ఎప్పుడూ మీలోని ఆశను, ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వీడవద్దు. జీవించాలనే ఆశతో మృత్యువుతో వీరోచితంగా పోరాడుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మనసు నుంచి వచ్చిన మాటలివి. ఎంచుకున్న వృత్తిలో రాణించేవరకు ఆయన కూడా సాధారణ విద్యార్థే. అద్బుత విజయాలు ఆయనకు అయాచితంగా రాలేదు.
చదువులో చాలా సాధారణ విద్యార్ధి వరుణ్ సింగ్. 12వ తరగతిలో ఫస్ట్ డివిజన్ మాత్రమే పొందారాయన. చదువొక్కటే కాదు.. ఆటలు, ఇతర కార్యక్రమాల్లో కూడా అంత చురుకైన విద్యార్ధి కాదట. విమానాలు, విమానయానం గురించి తెలుసుకోవాలని మాత్రం ఆసక్తి. కానీ అవన్నీ సాధ్యమవుతాయనే భావన ఆయనలో వుండేదిట. ఎప్పుడైతే ఫ్లైట్ స్క్వాడ్రన్లో యంగ్ ఫ్లైట్ లెఫ్టినెంట్గా ఎంపికయ్యాడో.. అప్పటి నుంచి ఆయన ఆలోచన మారిపోయింది. మనస్సు పెట్టి. ఏకాగ్రత, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే.. గొప్పగా పనిచేయగలనని వరుణ్ కి అర్థమైంది. ఇదే విషయాలు ఆయన తనలేఖలో పేర్కొన్నారు.
ఛాలెంజింగ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్స్ కోర్సులో రెండు ట్రోఫీలను గెలుచుకున్న వరుణ్ కెరీర్లో వెనుతిరిగి చూడలేదు. తేజస్ ఫైటర్ స్క్వాడ్రన్లో పోస్టింగ్ పొందడంతో ఆయనలో విశ్వాసాన్ని బాగా పెంచిందట. ఇస్రో చరిత్రలో మేకింగ్ గగన్యాన్ ప్రొగ్రామ్ కోసం 12 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో కూడా చోటుదక్కించుకున్నారంటే వరుణ్ సింగ్ ఎంత ప్రతిభ కనబరిచారో అర్థం చేసుకోవచ్చు. టెంత్ క్లాస్, ఇంటర్, 12వ తరగతి మార్కులే ప్రాతిపదిక కాదు. మీ మార్కులు మీజీవితాన్ని శాసించలేవని వరుణ్ సింగ్ తన లేఖలో పేర్కొన్న అంశాలు ఇప్పుడు కోట్లాదిమంది యువతను ఆలోచింపచేస్తున్నాయి.