NTV Telugu Site icon

కేసీఆర్‌ క్రిస్మస్‌ విందు.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఇలా వెళ్లాల్సిందే..!

క్రైస్తవులకు పర్వదినమైన క్రిస్మస్‌ను పురస్కరించుకొని సీఎం కేసీఆర్‌ ఎల్బీ స్టేడియంలో మంగళవారం విందును ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎల్బీ నగర్‌ వైపుకు వెళ్లే ట్రాఫిక్‌పై ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీని ప్రకారం, బీజేఆర్‌ విగ్రహం వైపు ట్రాఫిక్ అనుమతించబడదని, నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు.

అదేవిధంగా, అబిడ్స్ రోడ్ నుండి ట్రాఫిక్‌ను బీజేఆర్‌ విగ్రహం వైపు అనుమతించరు. ఆ వైపు వచ్చే వాహనాలను ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ వద్ద చాపెల్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుండి ట్రాఫిక్‌ బషీర్‌బాగ్ జంక్షన్ వద్ద లిబర్టీ వైపు మళ్లించబడుతుందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాహనదారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.