ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్గా మారిపోయింది… దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మూడు నెలల క్రితం అత్యవసరంగా హన్మకొండకు వచ్చిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీ ఇక్కడే చిక్కుకుపోయి.. అనేక ఇబ్బందులు పడింది.. కరీంనగర్కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు. పదేళ్లుగా దుబాయ్లో నివాసముంటున్నారు. హరిత రెడ్డి ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుండగా, శ్రీనివాస రెడ్డి టెక్ మహేంద్ర కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 18న హరిత రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి కన్నుమూయడంతో ఈ దంపతులిద్దరూ కొడుకు సంజిత్ రెడ్డితో అదే రోజు హన్మకొండకు వచ్చారు. భారత్లో కరోనా వ్యాప్తితో ఏప్రిల్ 24 నుంచి యూఏఈ ప్రభుత్వం భారతీయ విమానాలపై నిషేధాన్ని విధించడంతో వారు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఆరుసార్లు విమాన టికెట్లు కొన్నప్పటికీ మారుతున్న నిబంధనలతో ప్రతిసారీ ప్రయాణం వాయిదా పడింది.. అయితే, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా కలిగిన వారు తమ దేశంలోకి రావొచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ దంపతులిద్దరూ దుబాయ్కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు.. అనుమతి కూడా లభించింది. ఇక, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ ముగ్గురితోనే ఎయిర్బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం… హైదరాబాద్ నుంచి షార్జాకు చేరుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది..