తెలంగాణ మాజీ స్పీకర్ తాజాగా ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. గవర్నర్ కోటాలో నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారిని ఎంపిక చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనచారి పేరును ప్రతిపాదిస్తూ రాజ్భవన్కు ఫైలును పంపించగా… గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీకి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను మంగళవారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
Read Also: పంతం నెగ్గించుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి
కాగా 2014 ఎన్నికల్లో భూపాలపల్లి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మధుసూదనాచారి స్పీకర్గా సేవలు అందించారు. అనంతరం 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి మధుసూదనాచారికి ఏ పదవి దక్కలేదు. దీంతో ఇప్పుడు కేసీఆర్ నామినేటెడ్ పదవిని కట్టబెట్టారు. కాగా గతంలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా పాడి కౌశిక్ రెడ్డి పేరును ప్రతిపాదించగా… గవర్నర్ తిరస్కరించడంతో రాష్ట్ర ప్రభుత్వం మరో అభ్యర్థిని ఆమోదం కోసం పంపింది. ఇటీవల కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కడంతో గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా మధుసూదనాచారికి అవకాశం ఇచ్చారు.
