యాదాద్రి ఆలయ పునః ప్రారంభం ఎప్పుడు అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు… టెంపుల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇలా.. ఎప్పటికప్పుడు భక్తులను కట్టిపడేస్తున్నాయి.. దీంతో.. యాదాద్రి ప్రారంభం ఎప్పుడు.. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేది మరెప్పుడు అని తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. దీనిపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు సీఎం కేసీఆర్.. ఇవాళ యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉటుందని ప్రకటించారు.. మహాకుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు వెల్లడించిన ఆయన.. మహాకుంభ సంప్రోక్షణకు 8 రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని తెలిపారు.
యాదాద్రి ఆలయాన్ని పరిశీలించిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. యాదాద్రి ఒకప్పుడు మంచి నీళ్లకు కూడా బాధపడ్డ పరిస్థితి.. ఇప్పుడు నృసింహ సాగర్ (బస్వాపూర్ రిజర్వాయర్) నిర్మాణం పూర్తి కావస్తుంది.. గోదావరి జలాలు స్వామివారి పాదాలను స్పృశించనున్నాయి అని వెల్లడించారు.. యాదాద్రికి వస్తే ఉండేందుకు స్థలం లేదని చెప్పేవారు, ప్రసిద్ధ వ్యక్తులు వచ్చినప్పుడు ఉండేందుకు ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మించాం, 250 కాటేజీల నిర్మాణం చేపట్టబోతున్నాం అన్నారు.. ఇక, అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ రూపుదిద్దుకుంది, ఆలయ పునర్ ప్రారంభానికి మహా కుంభసంప్రోక్షణం చేపట్టబోతున్నాం, మహా సుదర్శన యాగం చేయబోతున్నాం, యాగం తలపెడితే నిర్విఘ్నంగా సాగాలన్నారు. మరోవైపు, సమైక్య పాలకుల పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఆధ్యాత్మికంగా కూడా అన్యాయం జరిగిందన్న ఆయన.. గతంలో పుష్కరాలను కూడా తెలంగాణలో నిర్వహించలేదని గుర్తుచేసుకున్నారు.. ఆధ్యాత్మిక సంపద ఉన్న ప్రాంతం తెలంగాణ. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి గతంలో ప్రాచుర్యం కల్పించలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రాచుర్యంలోకి తెచ్చామన్నారు.. యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితం బీజం వేశాం. మహోత్కష్టమైన ఆలయాల్లో ప్రముఖమైనది యాదాద్రి. యాదాద్రి వైభవం నలుదిక్కులా చాటేందుకు పునర్నిర్మాణం చేపట్టాం. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు జరిగాయని వెల్లడించారు.. ఇక స్వామివారి విమాన గోపురాన్ని స్వర్ణ తాపడం చేయించబోతున్నాం.. ఇందుకు 125 కిలోల బంగారం అవసరం అన్నారు సీఎం కేసీఆర్.. ప్రతి గ్రామాన్ని ఇందులో భాగస్వామ్యం చేయబోతున్నామన్న ఆయన.. మనకు 12,769 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, ఆ గ్రామాల్లో పూజలు చేసి డబ్బు ఇస్తే ఆర్బీఐ నుంచి బంగారం కొంటాం అన్నారు.. ఈ సందర్భంగా యాదాద్రి టెంపుల్కు బంగారాన్ని విరాళంగా ఇవ్వనున్న కొందరు వ్యక్తుల పేర్లను కూడా వెల్లడించారు కేసీఆర్.
