దక్షిణ కొరియాలో గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో వైద్యులు, ప్రభుత్వం మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. సమ్మెను వీడి విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవని ఆ దేశ ఆరోగ్యశాఖా మంత్రి హెచ్చరించారు. ఇప్పటికే వారి లైసెన్స్లు రద్దు చేసినట్లు తెలుస్తోంది.
దక్షిణ కొరియాలో రెండు వారాల నుంచి జూడాలు సమ్మె చేస్తున్నారు. దీంతో దాదాపు 9 వేల మందికి పైగా జూనియర్ వైద్యులపై చర్యలు తీసుకొనేందుకు దక్షిణ కొరియా (South Korea) రంగం సిద్ధం చేస్తోంది.
వైద్యుల ఆందోళన కారణంగా వేలాది ఆపరేషన్లు నిలిచిపోయాయి. సమ్మెను ఆపి తక్షణమే విధుల్లో చేరాలని.. లేకపోతే చర్యలు తప్పవని ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం ఆ దేశ ఆరోగ్యశాఖ మంత్రి చో క్యోహాంగ్ మాట్లాడుతూ ప్రభుత్వ సిబ్బంది ఆస్పత్రులకు వెళ్లి తనిఖీలు చేస్తారన్నారు. విధుల్లో ఎవరైనా చేరకపోతే మరో ఆలోచన లేకుండా చర్యలు తీసుకొంటారని చెప్పారు. వారి కెరీర్లు కూడా చిక్కుల్లో పడతాయని వార్నింగ్ ఇచ్చారు.
వైద్యుల్లో ఒక సంఘం వారు ఈ సమ్మెలో పాల్గొన్నారు. ప్రధాన వైద్యశాలల్లోని డాక్టర్ల సంఖ్యలో వీరు 40 శాతం వరకు ఉంటారు. ఆదివారం కూడా కొరియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేల మంది వైద్యులు రాజధాని సియోల్లో ర్యాలీ చేశారు. ఈ సంఘం దేశంలోని ప్రైవేటు వైద్యులకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
కారణమిదే..
దక్షిణకొరియాలో దీర్ఘకాలంగా ఉన్న డాక్టర్ల కొరతను తీర్చేందుకు మరింత మందికి వైద్య విద్యలో అవకాశం కల్పించాలని ప్రభుత్వం ఫిబ్రవరిలో నిర్ణయించింది. మెడికల్ స్కూల్స్లో సీట్లను గణనీయంగా పెంచింది. దీనిని జూనియర్, రెసిడెంట్ డాక్టర్లు సహా ఇతర సిబ్బంది వ్యతిరేకించారు. వీధుల్లోనే ఆందోళన మొదలుపెట్టారు. అవసరమైతే ఉద్యోగాలను వదిలేస్తామని హెచ్చరించారు. వీరికి సీనియర్లు, ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. కానీ.. ప్రభుత్వం మాత్రం దిగి రాలేదు.
