కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్పై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం.. మొదటల్లో వ్యాక్సిన్లకు ధరలు నిర్ణయించి విమర్శలపాలైన కేంద్ర సర్కార్.. ఆ తర్వాత పూర్తిగా ఉచితమని ప్రకటించింది.. అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సినేషన్ చేయించుకుంటే డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇక, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది నరేంద్ర మోడీ సర్కార్.. ఇప్పటి వరకు వ్యాక్సిన్లపై ఎంత ఖర్చు చేశారంటూ సమాచార హక్కు చట్టం కింద ఎదురైన ప్రశ్నకు కేంద్రం సమాధానం ఇచ్చింది. కోవిడ్ వ్యాక్సిన్ల కొనుగోలు కోసం ఈనెల 20వ తేదీ వరకు రూ.19,675 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది.. వ్యాక్సిన్లపై సామాజిక కార్యకర్త అమిత్ గుప్తా ఆర్టీఐ కింద అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్ర ఆరోగ్యశాఖ..
2021–22 కేంద్ర బడ్జెట్లో కోవిడ్ వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వం రూ. 35,000 కోట్లను కేటాయిచినట్టు వెల్లడించారు.. ఈ నెల 20వ తేదీ వరకు వ్యాక్సిన్లపై రూ.19,675 కోట్లు ఖర్చు చేసినట్టు ప్రకటించారు. కాగా, కరోనా మహమ్మారిపై పోరాటానికి దేశీయంగా తయారైన వ్యాక్సిన్లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరి 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్కు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.. దేశీయ వ్యాక్సిన్లతో పాటు.. క్రమంగా మరికొన్ని విదేశీ సంస్థలు తయారు చేసిన వ్యాక్సిన్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది భారత్ సర్కార్.