NTV Telugu Site icon

ఢిల్లీ జోరుకు కళ్లెం వేసిన బెంగళూరు..

IPLలో మరో థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ ఫ్యాన్స్‌కు అసలు సిసలు మజా ఇచ్చింది. చివరి బంతి దాకా ఎవరు గెలుస్తారో తెలీని ఉత్కంఠ మధ్య… చివరికి ఢిల్లీపై బెంగళూరు పైచేయి సాధించింది. 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్‌ ఓడి ఢిల్లీ బ్యాటింగ్‌కు దిగాక… ఓపెనర్లు ధాటిగా ఆడారు. 10 ఓవర్లలోనే 88 పరుగుల భాగస్వామ్యం అందించారు. పృథ్వీ షా 48 రన్స్‌, శిఖర్‌ ధావన్‌ 43 రన్స్‌ చేశారు. రిషబ్‌ పంత్ కేవలం 10 పరుగులే చేసి ఔటయ్యాడు. శ్రేయాస్‌ అయ్యర్‌ కూడా 18 పరుగులకే వెనుదిరిగాడు. అయితే చివర్లో హెట్‌మయర్‌ ధాటిగా ఆడటంతో… 20 ఓవర్లలో 164 రన్స్‌ చేయగలిగింది… ఢిల్లీ. 165 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన బెంగళూరును… ఓపెనర్లు నిరాశ పరిచారు. తొలి బంతికే పడిక్కల్‌ డకౌట్‌ కాగా… కోహ్లీ కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలబడలేకపోయాడు.

కేవలం 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే శ్రీకర్‌ భరత్‌, డివిలీర్స్‌, మ్యాక్స్‌వెల్‌ తమ బ్యాటింగ్‌తో జట్టును విజయం దిశగా నడిపించారు. ముఖ్యంగా శ్రీకర్ భరత్‌ 52 బంతుల్లోనే 78 రన్స్‌ చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మాక్స్‌వెల్‌ 33 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ కొట్టేశాడు. డివిలీర్స్‌ 26 రన్స్‌ చేశాడు. విజయానికి చివరి ఓవర్లో 15 రన్స్‌ కావాల్సి ఉండగా… పేసర్ అవేశ్‌ తొలి ఐదు బంతులకు 9 రన్స్‌ మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి బెంగళూరు బ్యాట్స్‌మెన్‌ సిక్స్‌ కొడతాడా? ఢిల్లీ బౌలర్‌ కట్టడి చేస్తాడా? అనే ఉత్కంఠ మధ్య… శ్రీకర్‌ భరత్‌ లాస్ట్‌ బాల్‌ను స్టాండ్స్‌లోకి పంపి… కోహ్లీ సేనలో జోష్‌ నింపాడు. జట్టును గెలిపించిన అతనికే మ్యాన్‌ ఆఫ్‌ ద అవార్డ్‌ దక్కింది.