అంచనాలు తలకిందులు.. భారత్‌కు కాళరాత్రి చూపించిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భారత అభిమానుల అంచనాలు తలకిందులయ్యాయి. తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 10 వికెట్లతో విజయఢంకా మోగించింది. తద్వారా ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి టీమిండియాపై విజయకేతనం ఎగురవేసింది. మహమ్మద్ రిజ్వాన్, బాబర్ ఆజమ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. రిజ్వాన్ 55 బంతుల్లో 79 నాటౌట్, బాబర్ 52 బంతుల్లో 68 నాటౌట్ పరుగులు చేశారు. భారత బౌలర్లందరూ సమష్టిగా విఫలమయ్యారు. పాకిస్థాన్ జట్టుది ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. అంతకుముందు టాస్ ఓడి తొలుత భారత్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లు ఘోరంగా విఫలం కావడంతో కెప్టెన్ కోహ్లీ 57 పరుగులతో రాణించాడు. పంత్ (39) అతడికి సహకరించాడు. దీంతో 20 ఓవర్లలో భారత్ 151/7 స్కోరు చేసింది.

Also Read: కోహ్లీపై విమర్శలు.. కిషన్‌ను కాదని పాండ్యాను తీసుకుంటారా?

కాగా ఈ మ్యాచ్‌ గెలిచిన పాకిస్తాన్ జట్టు.. భారత్‌కు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. ఇప్పటివరకు టీ20 వరల్డ్ కప్‌, వన్డే ప్రపంచకప్.. ఇలా ఏ ప్రపంచకప్‌లో అయినా పాక్ చేతిలో భారత్‌ ఓటమే ఎరుగదు. కానీ ఈ మ్యాచ్‌లో గెలవడంతో పాకిస్తాన్ ఆ అపవాదును తొలగించుకుంది. తొలి విజయం.. అది కూడా పది వికెట్ల తేడాతో పాక్ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో భారత అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.