Site icon NTV Telugu

ఒమిక్రాన్‌ ఎఫెక్ట్‌.. మళ్లీ విద్యార్థులకు ఆన్‌ లైన్‌ క్లాసులు !

ఇంజనీరింగ్, డిగ్రీ ఫస్టియర్‌ విద్యార్థులకు కాలేజీలు మొదలవ్వబోతున్నాయి. ఇప్పటికే కొత్త విద్యార్థులకు పరిచయ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలబడేట్టు కన్పించడం లేదు. కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ నీలినీడల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి తిరిగి ఆన్‌లైన్‌ బోధన ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలను సిద్ధం చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియలో భాగంగా మంగళవారం రాష్ట్రం లోని అన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో సమావేశం నిర్వహిస్తోంది.

ఆన్‌లైన్‌ విద్యాబోధనే ఇందులో ప్రధాన ఎజెండా కావడం గమనార్హం. వీలైనంత ఎక్కువగా విద్యార్థులను, అధ్యాపకులను, కాలేజీల యాజమాన్యాలను సిద్ధం చేసే అంశాలపై ఈ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై స్పష్టత లేకున్నా ఆన్‌లైన్‌ బోధనను ప్రత్యామ్నాయంగా అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు. ప్రత్యక్ష బోధనతోపాటు ఆన్‌లైన్‌కూ కాలేజీలు ప్రాధాన్యత ఇవ్వడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ఉన్నారు. ప్రాథమిక విశ్లేషణల ప్రకారం అన్ని వర్సిటీలు ఆన్‌లైన్‌ బోధనకే ప్రాధాన్యమిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు.

గతంలో ఆన్‌లైన్‌ బోధనపై అనేక విమర్శలొచ్చిన నేపథ్యంలో ఈ విధానంలో ఎదురవుతున్న సమస్యలపై సమావేశంలో చర్చించనున్నారు. కాలేజీల్లో ముందస్తు ప్రణాళిక లేకపోవడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కొరవడటం వల్ల బోధన సరిగా జరగలేదని ఆరోపణలొచ్చాయి. కొన్నిచోట్ల అధ్యాపకులు సెల్‌ఫోన్‌ ద్వారా తరగతు లు బోధించారు. ఇందులో సబ్జెక్టు ప్రాధాన్యత కొరవడిందని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జూమ్‌ మీటింగ్‌ల ద్వారా కూడా బోధనకు అనేక సమస్యలు వచ్చాయి. చాలాచోట్ల ఫ్యాకల్టీలు సాంకేతికతకు అలవాటు కాలేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ బోధన కోసం మార్గదర్శకాలు రూపొందించాలని ఉన్నత విద్యామండలి భావిస్తోంది.

Exit mobile version