పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో జనం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతున్నారు. వచ్చీరావడంతోనే సంచలనం రేపింది ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్. బుక్ చేసుకున్న లక్షలాది మంది కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రైడింగ్ ఎప్పుడు చేద్దామా అని ఎదురుచూస్తున్నారు. ఓలా ఎస్ 1, ఎస్ 1 ప్రో స్కూటర్ డెలివరీలు ఇంకొంత కాలం ఆలస్యం అవుతాయని తెలుస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీ ఆలస్యానికి చిప్ల కొరతే కారణమని తెలుస్తోంది. దేశీయంగా చిప్ ల తయారీ అంతగా లేకపోవడంతో విదేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో చిప్ కొరత వేధిస్తుండటమే ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల డెలివరీలో జాప్యానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఓలా తన ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లతో ఆగస్టు 15న లాంచ్ చేసింది. అక్టోబర్ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ తర్వాతి కాలంలో నవంబర్కు వాయిదా వేసింది. చివరగా డిసెంబర్లో డెలివరీలు ప్రారంభమవుతాయిని ప్రకటించింది.
ఇలా నెలకోసారి డెలివరీ డేట్లు మార్చడంపై వినియోగదారులు అసహనంతో వున్నారు. మొదటి విడతలో బుకింగ్ చేసుకున్న 100 మందికి మాత్రమే వాహనాలు డెలివరీ అయ్యాయి. బెంగళూరు, చెన్నై నగరాల్లో మాత్రమే అవి అందుబాటులోకి వచ్చాయి. ఓలా ఎస్1 వేరియంట్ధర రూ. 99,999 వద్ద, ఎస్1 ప్రో ట్రిమ్ వేరియంట్ రూ.1,29,999 వద్ద విడుదలయ్యాయి. కేవలం రూ.499లతో వీటి బుకింగ్స్ ప్రారంభించఇంది. అతి తక్కువ సమయంలోనే అత్యధిక బుకింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది. తమిళనాడులో ఓలా స్కూటర్ల ఉత్పత్తిని ప్రారంభిస్తామని ఆ సంస్థ సీఈవో చెబుతున్నారు. రెండవ విడత బుకింగ్స్ జనవరిలో ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. ముంబై, వైజాగ్, పూణె, అహ్మదాబాద్ నగరాల్లో వచ్చేవారంలో డెలివరీలు వుంటాయని సీఈవో తెలిపారు.