దేశంలో గత ఏడాది కాలంగా డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరిగాయని ప్రధాని మోదీ వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఫిన్టెక్ ఇన్ఫినిటీ ఫోరంలో మాట్లాడిన ఆయన… గత ఏడాది కాలంలో మొబైల్ చెల్లింపులు మొదటిసారిగా ఏటీఎం నగదు ఉపసంహరణలను మించిపోయాయని ట్విట్టర్ ద్వారా తెలిపారు. గత ఏడాది కాలంలో సుమారు 6.90 కోట్ల రూపే కార్డులను వినియోగదారులు తీసుకున్నారని… వాటి ద్వారా సుమారు 130 కోట్ల లావాదేవీలు జరిగాయని వివరించారు.
Read Also: 2022: కొత్త ఏడాదిలో భారీగా పెరగనున్న ధరలు
దేశంలో ఎటువంటి భౌతిక కార్యాలయాలు లేకుండా పూర్తిగా డిజిటల్ బ్యాంకులు నడిచే రోజులు రానున్నాయని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. రానున్న దశాబ్ద కాలంలో డిజిటల్ చెల్లింపులు సర్వసాధారణం అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో, కొత్త ఆవిష్కరణలను చేయడంలో భారతదేశానికి మరొకటి సాటిరాదన్నారు. మరోవైపు ఆర్థిక లావాదేవీల విషయంలో సాంకేతిక పరిజ్ఞానం విపరీతంగా పెరిగిందని ప్రధాని మోదీ వెల్లడించారు. దీంతో దేశంలో భారీగా మార్పు వచ్చిందని, ప్రజలు డిజిటల్ లావాదేవీలను వినియోగించడంలో ముందున్నారని మోదీ తెలిపారు.
