NTV Telugu Site icon

కోటి దీపోత్సవంలో యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహుడి కల్యాణం

ఈ నెల 12 నుంచి 22 వరకు హైదరాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తున్నాయి. వేలాదిమంది భక్తులు స్టేడియానికి తరలివచ్చి కోటి దీపోత్సవంలో పాల్గొంటున్నారు. ఇవాళ్టికి భక్తి టీవీ కోటిదీపోత్సవం నేడు 9వ రోజుకు చేరుకుంది. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం భక్తులకు శ్రవణానందాన్ని కలిగించింది. వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు.

ఇవాళ్టి కోటి దీపోత్సవానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ హాజరయ్యారు. గణపతి సచ్చిదానంద ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించేందుకు స్వామివార్లను కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణంలో ఊరేగించారు.ఈ ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తులు ఉత్సాహం చూపించారు. భక్తులు వెలిగించిన దీపాల మధ్య త్రినేత్రుడి దర్శనం నేత్రపర్వంగా జరిగింది. హర హర మహాదేవ శంభో.. శివ శివ శంకర.. భక్తవ శంకర అంటూ భక్తులు నినదించారు.

స్వామి వారికి నిర్వహించిన సప్తహారతి వీక్షణం సర్వపాపహరణం. ఏ హారతి దర్శనం వల్ల ఏం పుణ్యం ప్రాప్తిస్తుందో.. ఎలాంటి కష్టాలైనా హారతి దర్శనం వల్ల తొలగిపోతాయని వేదపండితులు సెలవిచ్చారు. ఈ కార్యక్రమాలను చూసి అద్భుత అనుభూతిని స్వంతం చేసుకోండి. కోటి దీపోత్సవం మరో రెండురోజులు మాత్రమే వుంది. మిస్సవకండి. ప్రతి రోజూ సాయంత్రం 6 గంటలకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కల్పించింది. ఇంకెందుకు ఆలస్యం.. రండి తరలిరండి.. ఆ కైలాసనాథుడిని దర్శించి పునీతులుకండి. దివ్యానుభూతిని స్వంతం చేసుకోండి.