రైలు ప్రయాణం చేయాలంటే ఇప్పుడు ఆన్లైన్లోనే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన చోట సీటును ఎంచుకునే సౌకర్యం ఉంది. రైలు ప్రయాణంలో రుచికరమైన ఆహారాన్ని కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అయితే మీ రైలు ప్రయాణానికి టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే 35 పైసలకే రూ.10 లక్షల వరకు ఇన్సూరెన్స్ ఇస్తుందన్న సంగతి మీకు తెలుసా?
ఐటీఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే సమయంలో భారతీయ రైల్వే కేవలం 35 పైసల ప్రీమియంతో రైలులో ప్రయాణించే వ్యక్తులకు రూ. 10 లక్షల వరకు బీమా రక్షణను అందిస్తోంది. ఎందుకంటే ఏదైనా ప్రమాదం జరిగిన పరిస్థితుల్లో ప్రయాణికుల కుటుంబానికి రక్షణగా ఉండేందుకు కారుచౌకగా ఈ బీమాను ఇస్తున్నారు.
ఇన్సూరెన్స్ ఎలా పొందాలి?
IRCTC ద్వారా మీ రైలు టిక్కెట్ను బుక్ చేసేటప్పుడు మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది. మీరు ఈ ఆప్షన్ను ఎంచుకుంటే బీమా కవర్ ఇవ్వబడుతుంది. అదే సమయంలో ఒక PNR నంబర్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ఈ బీమా వర్తిస్తుంది.
బీమా ఏ సందర్భాల్లో వర్తిస్తుంది?
- శాశ్వత పాక్షిక వైకల్యం
- శాశ్వత వైకల్యం
- ఆసుపత్రి ఖర్చులు
- ప్రయాణ సమయంలో మరణం
- మృతదేహాల రవాణా కోసం
ఎంత బీమా పొందే అవకాశం ఉంటుంది?
- ఆసుపత్రిలో చేరేందుకు రూ.2 లక్షల కవరేజీ
- శాశ్వత పాక్షిక వైకల్యానికి రూ.7.5 లక్షల కవరేజీ
- మృత దేహాలను రవాణా చేసేందుకు రూ.10 వేల కవరేజీ
- రైలు ప్రమాదం లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన కారణంగా మరణిస్తే రూ.10 లక్షల కవరేజీ
