ఎక్కడ ఏ ఎన్నిక జరిగినా అందులో కులమే కీలకం. అభ్యర్థి ఎంపిక మొదలు గెలుపు వరకు కులందే ప్రధాన భూమిక. నిజం చెప్పాలంటే ఇప్పుడు నడుస్తున్నది కుల రాజకీయం. కులాల మీద మీద ఆధారపడి రాజకీయం చేస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కూడా కుల రాజకీయం ఓ రేంజ్లో నడుస్తోంది. కులం ఓట్లను పక్కా చేసుకునే పనిలో పడ్డాయి ప్రధాన పార్టీలు.
కులం ఓట్ల కోసం నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. పెద్ద పెద్ద ప్లాన్లు వేస్తున్నారు. ఎక్కువ ఓట్లున్న సామాజిక వర్గాలను ప్రధాన లక్ష్యంగా చేసుకుని కథ నడుపుతున్నారు. ప్రచారానికి గడువు ఇంకో వారం రోజులే ఉంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారంలో బీజీగా ఉన్నారు. మరోవైపు, ఇతర పార్టీ నాయకులు..వ్యూహకర్తలు కుల నాయకులపై ఫోకస్ పెట్టారు. వారి మద్దతు కోసం బేరసారాలు నడుపుతున్నారు. ఎక్కువ ఓట్లున్న కులాలను ముందు టార్గెట్ చేస్తున్నారు. ఆ సామాజిక వర్గాలను ప్రభావితం చేసే నేతలను గుర్తించి వారి ద్వారా రాజకీయ నడుపుతున్నారు.
కులం ఓట్లకు గాలం వేయటంలో బీజేపీ, టీఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. ఐతే, ఇందులో అధికార పార్టీకి సహజంగానే అడ్వాంటేజ్ ఉంటుంది. ప్రభుత్వ పథకాలు ..హామీలతో ఓటర్లను తమ వైపు తిప్పుకుంటాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నా పార్టీకే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీల అభ్యర్థికి కూడా కొంత వరకు ఈ అడ్వాంటేజ్ ఉంటుంది ఈ విషయంలో. నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్న టీఆర్ఎస్, బీజేపీ రెండూ అధికార పార్టీలే. కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి కూడా నియోజకవర్గం ప్రజలు లబ్ధిపొందుతున్నారు.
బీజేపీ, టీఆర్ఎస్ అభ్యర్థులలో ఎవరిని ఎవరిని ఎంచుకోవాలో ఓటర్లు తేల్చుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ రెండు పార్టీల నాయకులు ఒకరి తరువాత ఒకరు కుల పెద్దలను సంప్రదిస్తున్నారు. సమస్యలకు చిటికెలో పరిష్కారం చూపిస్తున్నారు. సంబంధిత అధికారులకు ఫోన్ చేసి హడావుడి చేస్తున్నారు. నిరంతరం జిల్లా స్థాయి కుల నేతల టచ్లో ఉంటున్నారు. వారికి ఓ కారు, డ్రైవర్ ని ఇచ్చి నియోజకవర్గం అంతా తిరిగి ఆ కులస్తులను కలిసి, చెప్పాల్సింది చెప్పి ఓటు వేసేలా ఒప్పించాలి. ఇదీ ఇప్పుడు నడుస్తున్న వ్యూహం. నియోజకవర్గం మొత్తం తిరగటానికి అయ్యే ఖర్చులు..తిండి..బస వంటివన్నీ పార్టీయే చూసుకుంటుంది.
కుల నాయకులను కలిసిన సందర్భంలో గుర్తించిన సమస్యలను పార్టీ నాయకులకు దృష్టికి తీసుకువెళ్లి అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తున్నారు. అలా కుదరకపోతే పరిష్కారానికి పక్కా హామీ ఇస్తున్నారు. నిర్దిష్ట అభ్యర్థికి గంపగుత్తగా ఓట్లు వేయాలని కులస్తులను ప్రోత్సహిస్తూ అంతర్గత కుల సమావేశాలు జరుపుతున్నారు. వీటికి రాజకీయ నేతలు కూడా హాజరై హామీల వర్షం కురిపిస్తున్నారు.
అధికార పార్టీ నేతలు ఒకడుగు ముందుకేసి రెడ్డి గర్జన, గౌడ గర్జన, కాపు గర్జన, ఎరుకల గర్జన వంటి వివిధ కులాల సమావేశాలు నిర్వహించారు. రెడ్డి గర్జనకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ప్రశాంత్ రెడ్డి హాజరయ్యారు. రెడ్డి సమాజికవర్గంలోని పేదలను అదుకునేందుకు రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇతర కులాల గర్జన సభలు కూడా జరిగాయి. ఆయా కులాలకు చెందిన మంత్రలు..ఎమ్మెల్యేలు ..సీనియర్ నేతలు హాజరై కథ నడిపిస్తున్నారు.ఈ కుల గర్జనలన్నీ హన్మకొండ పరిధిలోని హుజూరాబాద్ పట్టణ శివారులోని పెంచికలపేటలో జరగటం ఆసక్తిని కలిగిస్తోంది.. దీనికి కారణం ఈ ప్రదేశం ఎన్నికల కోడ్ పరిధిలోకి రాకపోవటమే. అందుకే నిర్వాహకులు దీనిని ఎంచుకున్నారు.
మరోవైపు, హుజురాబాద్ నియోజకవర్గంలో ఏ కులానికి ఎన్ని ఓట్లున్నాయో స్పష్టమైన లెక్కలు అందుబాటులో ఉన్నాయి. ఎంత మంది ఓటర్లున్నారు.. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి..జనాభా ఎంత అనే వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. గతంలో ప్రభుత్వం నిర్వహించిన సామాజిక-ఆర్థిక సర్వే నుండి సేకరించిన సమాచారంతో పాటు, కొన్ని ఏజెన్సీలు కుల డేటాను సేకరించాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం హుజూరాబాద్లో 2.25 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వారిలో దళితులదే అగ్ర స్థానం. మొత్తం ఇక్కడ 45 వేల పైచిలుకు దళిత ఓటర్లున్నారు. వారి తరువాత 29 వేలు, పద్మశాలి 26, గౌడ 24, ముదిరాజ్ 23, రెడ్డి 22 వేలకు పైగా ఓట్లున్నాయి. ఇప్పడు వాటిని విశ్లేషించే పనిలో ఉన్నాయి ప్రధాన పార్టీలు.
కుల ప్రాతిపదికన ఓటర్లను ఆకర్షించడం మంచి సాంప్రదాయం కాదు. కానీ ఇప్పుడు అవే ఓటు బ్యాంకులుగా మారాయి. కొన్ని దశాబ్దాలుగా అభ్యర్థుల గెలుపు ఓటములలో ఈ కుల సమీకరణాలే ప్రధానం కావటం బాధాకరం. ఎన్నికల సందర్భంలో పార్టీలు అనుసరించే ఇలాంటి దోరణలు సమాజాన్ని మరింత విడదీస్తాయి. భవిష్యత్లో ఈ కుల బలం ఆధారంగానే నిధులు కేటాయించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
Read: ఇంకో ఏడు రోజులే..వేడెక్కిన ప్రచారం!