తెలుగు టీవీ ప్రేక్షకులను అలరిస్తున్న టీవీషో బిగ్ బాస్ హౌస్లో ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ నినాదం మార్మోగింది. యువ ప్రతిభావంతులైన నటులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు బిగ్బాస్ షో ద్వారా ముగ్ధులవుతున్న కోట్లాదిమంది ప్రజానీకానికి ఒక మంచి సందేశం అందించాలనే తలంపుతో నిర్వాహకులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ఇందులో భాగం చేశారు. ఈ నేపథ్యంలో పచ్చదనమే రేపటి ప్రగతి పథమని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ హౌస్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం గురించి ఆసక్తికరమైన సంభాషణ నడిచింది. ‘ఈ సంవత్సరం ముగిసిపోవడానికి ఇంకా మూడు వారాల సమయం ఉందని.. ఇప్పటి వరకు ఎన్నో చేసుంటాం కానీ, ఈ మూడు వారాలు.. వారానికి ఒకటి చొప్పున మూడు మొక్కలు నాటి 2021కి మంచి ఫినిషింగ్ ఇవ్వాలి‘ అంటూ నాగార్జున హౌస్లోని కంటెస్టెంట్లకు, ప్రేక్షకులకు పిలుపునిచ్చారు. అంతేకాదు మొక్కలు నాటడమే ఒక కార్యక్రమంగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను బిగ్బాస్ స్టేజీపైకి ఆహ్వానించారు.
గత ఐదేళ్లుగా మొక్కలు నాటడం, నాటించడం ఒక దినచర్యగా పెట్టుకుని కోట్లాది మొక్కలు నాటిన రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ను నాగార్జున అభినందించారు. ఒక్క మనిషి తన ఆలోచనతో, ప్రకృతి బాగుండాలనే తపనతో కోట్లాది మొక్కలు నాటితే.. బిగ్ బాస్ హౌస్ పిలునిస్తే ఇంకా ఎన్ని కోట్ల మొక్కలు నాటొచ్చో ఊహించుకోండని ప్రేక్షకులను కదిలించే ప్రయత్నం చేశారు. గ్లోబల్ వార్మింగ్ను అరికట్టి భవిష్యత్ తరాలు ఈ భూమిపై మనుగడ సాగించాలంటే.. మొక్కలు నాటడం ఒక్కటే మార్గమని నాగార్జున ప్రేక్షకులకు సూచించారు.
అనంతరం ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి మొక్కలు నాటాలి, కాపాడాలి అనే ఆలోచనను కలిగించాలని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తీసుకున్నామని తెలిపారు. ‘ఒకచోట ఒకరు ఒకటి రెండు మొక్కలు నాటారు, మరోచోట టీంలుగా కొంతమంది కలిసి మొక్కలు నాటారు. ఇక స్టార్స్, సెలెబ్రెటీలు అయితే ఫారెస్ట్ లను దత్తత తీసుకున్నారు. హీరో ప్రభాస్ 1643 ఎకరాలు, హెటిరో డ్రగ్స్ పార్ధసారథి రెడ్డి 2500 ఎకరాల అడవులను దత్తత తీసుకుని మొక్కల్ని పెంచుతున్నారు. మేం నిరంతరం మొక్కల యజ్ఞం చేస్తున్నాం. శక్తి ఉన్నంతవరకు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తునే ఉంటాం, మా ఈ ప్రయత్నం ఈరోజు మీ ద్వారా కోట్లమందికి చేరింది. ఇంత అద్భుతమైన షోలో మా గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు భాగస్వామ్యం కల్పించిన నాగార్జున గారికి, స్టార్ మాటీవీ వారికి, బిగ్ బాస్ నిర్వాహకులకు, కంటెస్టెంట్లకు, టెక్నిషీయన్లకు కృతజ్ఞతలు’ అంటూ ఎంపీ సంతోష్ కుమార్ మాట్లాడారు.
చివరగా హీరో నాగార్జున మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్, వారి మాటలు, స్పూర్తి తనను ఎంతో కదిలించాయన్నారు. తాను కూడా వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్టును దత్తత తీసుకుంటానని.. సంతోష్ కుమార్ ఎక్కడ చూపెడితే అక్కడ అడవిని దత్తత తీసుకుని మొక్కలను పెంచుతానని తెలిపారు. సమాజం పట్ల తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తానని నాగార్జున పేర్కొన్నారు.