హైదరాబాద్లోని గాంధీ ఆస్పత్రి మరో అరుదైన ఘనత అందుకుంది… జంట నగరాల్లో పెద్దాస్పత్రిగా ఉన్న గాంధీలో.. అనేక అత్యుధునికి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నారు.. ఇక, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా మహమ్మారికి కూడా మొదట ప్రభుత్వం గాంధీలోనే వైద్య సేవలు ప్రారంభించిన సంగతి తెలిసిందే.. ఇప్పుడు ఐసీఎంఆర్, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ రీసెర్చ్(డీహెచ్ఆర్) అభివృద్ధి చేస్తున్న ‘ఇండియన్ క్లినికల్ ట్రయల్ అండ్ ఎడ్యుకేషన్ నెట్వర్క్’ (ఐఎన్టీఈఎన్టీ-ఇంటెంట్)కు గాంధీ ఆస్పత్రిని ఎంపిక చేశారు.. ఇంకో విషయం ఏంటంటే.. దక్షిణ భారత దేశం నుంచి ఈ ఘనత అందుకున్న తొలి ఆస్పత్రి గాంధీయే కావడం విశేషం.
దక్షిణాది రాష్ట్రాలకు ‘రీజినల్ క్లినికల్ ట్రయల్స్ యూనిట్’గా ఎంపికై రికార్డు సృష్టించింది గాంధీ ఆస్పత్రి.. దేశంలో ఆరోగ్య సంరక్షణ కోసం పాలసీలు, కార్యక్రమాల రూపకల్పనకు కావాల్సిన ఆధారాలను క్లినికల్ ట్రయల్స్, ఇతర పరిశోధనల ద్వారా తయారుచేసేందుకు ఐసీఎంఆర్, డీహెచ్ఆర్ సంయుక్తంగా ‘ఇంటెంట్’ పేరుతో నెట్వర్క్ను అభివృద్ధి చేస్తున్నాయి.. ఇందుకు ఆసక్తి ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు భాగస్వామి కావాలని ఐసీఎంఆర్ ఈ మధ్యే దరఖాస్తులను కూడా ఆహ్వానించింది.. అయితే, అన్ని అర్హతలను పరిశీలించిన తర్వాత గాంధీ ఆస్పత్రిని దక్షిణాదికి ‘రీజినల్ క్లినికల్ ట్రయల్ యూనిట్’ (ఆర్సీటీయూ)గా ఎంపిక చేశారు. ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించే క్లినికల్ ట్రయల్స్ గాంధీ ఆస్పత్రిలో జరగబోతున్నాయి.
