NTV Telugu Site icon

ఆ పరిస్థితిని మార్చడానికే ఈ నిర్ణయం : సీఎం జగన్‌

ఏపీ సీఎం జగన్‌ ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో కృష్ణా జిల్లాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాల్లో ఏపీ పాలవెల్లువ ద్వారా పాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కొనేవారు ఒక్కడే, అమ్మేవాళ్లు అనేక మంది ఉంటే.. కొనేవాళ్లు ఎంత చెప్తే.. అంతకు అమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని, ఇలాంటి మార్కెట్‌ను ఇవాళ మన రాష్ట్రంలో కూడా చూస్తున్నామన్నారు.

అందుకే ఈ పరిస్థితిని మార్చడానికి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుందని, ఇవాల్టి నుంచి కృష్ణా జిల్లాల్లో రైతులకు, మహిళలకు మరింత మంచి ధర లభించనుందని ఆయన అన్నారు. అమూల్‌ ద్వారా పాలసేకరణ ప్రారంభించిన ఏడాది లోగానే 5 జిల్లాల్లో కార్యక్రమం కొనసాగుతుందని, ఇవాళ ఆరో జిల్లాల్లో కార్యక్రమం ప్రారంభిస్తున్నామని ఆయన వెల్లడించారు. మిగిలిన 7 జిల్లాల్లో కూడా త్వరలోనే పాలసేకరణ ప్రారంభం అవుతుందని ఆయన స్పష్టం చేశారు.