ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఉంది అంటూ సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. టీడీపీ కార్యాలయాలపై దాడులకు నిరసనగా పార్టీ కార్యాలయంలో 36 గంటల దీక్షకు దిగిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.. టీడీపీ కార్యకర్తలని భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశ్యంతో దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత డీజీపీదే.. ఫిర్యాదు చేద్దామని డీజీపీకి ఫోన్లు చేస్తే స్పందించలేదని.. దీంతో గవర్నర్కు ఫిర్యాదు చేశాం అన్నారు.. టీడీపీ నేతలను చంపేందుకు.. నేతల ఆస్తులపై దాడులు చేస్తున్నారని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపిన చంద్రబాబు.. అమిత్షాకు ఫోన్ చేసి.. ప్రభుత్వం-పోలీసులు కుమ్మక్కై దాడులు చేస్తున్నారని వివరించానని.. కేంద్రం జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని కోరాన్నారు.
మా పర్మిషన్ లేకుండా ఎందుకొచ్చారు?
మా పర్మిషన్ లేకుండా పోలీస్ అధికారి మా కార్యాలయానికి ఎందుకొచ్చారు..? అని ప్రశ్నించారు చంద్రబాబు.. డీజీపీ ఇంటికో.. ఆఫీసుకో పర్మిషన్ లేకుండా వస్తే ఊరుకుంటారా..? అని నిలదీసిన ఆయన.. ఈ డీజీపీ కొత్త సంస్కృతికి తెర లేపారు.. హ్యాట్సాఫ్ డీజీపీ.. శభాష్ డీజీపీ.. అంటూ ఎద్దేవా చేశారు. ఇక, ప్రభుత్వానికి చేత కాకుంటే పోలీసు వ్యవస్థను మూసివేసి ఇంటికెళ్లండి అంటూ మండిపడ్డారు చంద్రబాబు.. హోం మంత్రికి.. డీజీపీకి సిగ్గనిపించడం లేదా..? అంటూ ఫైర్ అయిన ఆయన.. ప్రజలకు రక్షణ కల్పించడం పోలీసుల బాధ్యత.. ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికి ఏం చేయాలో మాకు తెలుసన్నారు.. ఏపీలో శాంతి భద్రతలు విఫలమయ్యాయని ఆరోపించిన ఆయన.. లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఆర్టికల్ 356 పెడతారు.. ఎప్పుడూ ఆర్టికల్ 356ను సమర్ధించని పార్టీ.. దాని గురించి మాట్లాడుతోంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అన్నారు.. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా మూలాలు ఏపీలోనే ఉంటున్నాయని ఆరోపించారు చంద్రబాబు.. పొరుగు రాష్ట్రం డీజీపీ ఏపీలో గంజాయి సాగు జరుగుతోందంటూ ప్రకటనలిచ్చారు.. తెలంగాణ సీఎం తన రాష్ట్రాన్ని డ్రగ్ ఫ్రీ స్టేట్ చేసేందుకు సమీక్ష పెట్టారని గుర్తుచేశారు.
Read Also: రాష్ట్రం పరువు తీస్తున్నారు.. కుట్రలు చేస్తున్నారు..
బహిరంగ చర్చకు సిద్దమా..?
నేతల భాషపై బహిరంగ చర్చకు సిద్దమా..? అని సవాల్ చేశారు చంద్రబాబు.. గంజాయి స్మగ్లింగ్, సాగుపై ఉక్కుపాదం మోపండి.. మేమూ సహకరిస్తామన్న ఆయన.. ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం ఏపీలో ఉంది.. వైసీపీతో.. ప్రభుత్వంతో తెలుగుదేశానికి ఆస్తుల తగాదాలు లేవు.. దాయాదుల పోరు లేదు… కానీ, ఈ దాడులు ఏంటి? అని ఫైర్ అయ్యారు.. రోడ్లు వేయలేదు.. పన్నులు పెంచారు.. అప్పులు పాలయ్యాం.. ఏ పిల్లల కోసం పాటుపడుతున్నామో.. ఆ పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరం కానుంది.. ఏపీ నుంచి వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా జరుగుతోంది.. ఇంత వరకు నా మంచితనం.. పార్టీ మంచితనం చూశారు.. ఎల్లకాలం ఇది సాగదు అని హెచ్చరించారు. మతాలు, కులాల మధ్య ప్రభుత్వమే చిచ్చు పెడుతోందని ఆరోపించిన ఆయన.. ఎప్పుడైనా దేవాలయాలపై దాడులు జరిగాయా..? అంటూ ప్రశ్నించారు టీడీపీ అధినేత చంద్రబాబు.