NTV Telugu Site icon

విశాఖ రాజధాని అని చెప్పలేదు..! క్లారిటీ ఇచ్చిన కేంద్రం

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని విషయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొంటూ కేంద్రం ఓ ప్రకటన చేసింది. జులై 26న లోక్‌సభలో ఎంపీలు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కేంద్రం.. ఏపీ రాజధాని వైజాగ్ అని అర్థం వచ్చేలా ప్రకటన చేసింది. అయితే, దీనిపై మళ్లీ క్లారిటీ ఇచ్చింది కేంద్రం… వైజాగ్‌ ఏపీ రాజధాని అని చెప్పటం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది.. విశాఖ ఒక నగరం మాత్రమేనని తాజాగా పేర్కొంది.. పెట్రోలియం ట్యాక్స్‌కు సంబంధించి మాత్రమే విశాఖ పేరును ఉదహరించామని క్లారిటీ ఇచ్చింది.. ఇక, హెడ్డింగ్ పొరపాటు వల్లే ఈ సమస్య తలెత్తిందన్న కేంద్ర ప్రభుత్వం.. హెడ్డింగ్‌లో క్యాపిటల్‌తో పాటు సమాచారం సేకరించిన సిటీ పేరును కూడా చేర్చుతున్నామని వెల్లడించింది. దీనిపై లోక్‌సభ సచివాలయానికి కూడా సమాచారం ఇచ్చామని, ప్రధాన నగరాలలో పెట్రోల్ ధరల ప్రభావాన్ని అంచనా వేశామని తెలిపింది. కాగా, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. వైజాగ్‌ పరిపాలన రాజధానిగా నిర్ణయించింది.. ఇక, త్వరలోనే వైజాగ్‌ నుంచి పాలన ప్రారంభిస్తామని కూడా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు చెబుతూ వస్తున్నారు.