NTV Telugu Site icon

వైఎస్‌ వివేకా కేసు.. ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సీబీఐ

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. పులివెందుల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది సీబీఐ.. ఈ కేసులో గంగిరెడ్డి, సునీల్‌ యాదశ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరిపై అభియోగాలు మోపింది.. వివేకానందరెడ్డి మృతికి ఆ నలుగురు కారణమని పేర్కొంది.. ఇక, ఈ కేసులో నిందితులైనవారిని ఆగస్టు, సెప్టెంబర్‌లో అరెస్టు చేశామని.. అరెస్ట్ చేసిన నిందితులను జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించామని తెలిపింది. మరోవైపు, ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసిన విషయాన్ని కూడా పేర్కొంది సీబీఐ.

Read Also: వైసీపీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.. క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి..!

కాగా, దాదాపుగా నాలుగు నెలల నుంచి సాగుతున్న విచారణలో సేకరించిన పత్రాలతో కడిన నాలుగైదు బండిల్స్‌ను చార్జిషీట్‌లోని అంశాలకు ఆధారాలుగా సమర్పించింది సీబీఐ.. మంగళవారమే చార్జిషీట్ దాఖలు చేసేందుకు పులివెందుల కోర్టుకు వచ్చారు సీబీఐ అధికారులు.. కానీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సెలవులో ఉండటంతో.. తిరిగి వెళ్లిపోయిన అధికారులు.. ఇవాళ వచ్చి దాఖలు చేశారు. మరోవైపు.. సీబీఐ ఛార్జిషీట్‌ దాఖలు చేయడంతో.. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు… సీబీఐ ఛార్జిషీట్‌ కాపీని తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.