Site icon NTV Telugu

ఎంఐఎం ఎమ్మెల్యేపై కేసు నమోదు..

చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ పై కేసు నమోదు చేశారు పోలీసులు… 341, 323, 506 ఐసీపీ సెక్షన్ల కింద ముంతాజ్‌ ఖాన్‌పై కేసు బుక్‌ చేశారు హుస్సేనీ ఆలం పోలీసులు.. నిన్న అర్ధరాత్రి యువకుడి నమేస్తే కొట్టలేదాన్ని కారణంగా ముంతాజ్ ఖాన్ దాడి చేయడం.. ఆ యువకుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు పోలీసులు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హుస్సేనీ ఆలం పోలీస్​ స్టేషన్​పరిధిలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పాతబస్తీ చార్మినార్​ బస్టాండ్​వద్ద గులామ్​గౌస్​జిలానీ అనే యువకుడు 12.43 గంటల సమయంలో తన ఇంటి దగ్గర అరుగు ముందు మరో వ్యక్తితో కలిసి కూర్చుని మాట్లాడుతున్నాడు. అదే సమయంలో అటుగా వచ్చిన చార్మినార్​ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్​తన గన్‌మెన్లతో కలిసి అక్కడికి చేరుకున్నాడు. గులామ్​గౌస్​జిలాని వద్దకు వచ్చిన ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్​ఖాన్​.. 25 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా… నాకు సలామ్​ పెట్టవా అంటూ దుర్భాషలాడాడు. మొదట తాను చూడలేదన్న సదరు యువకుడు.. ఆ తర్వాత అయినా ఎందుకు సలామ్ పెట్టాలి అంటూ ఎదురు ప్రశ్నించాడు.. దీంతో ఆవేశంతో ఊగిపోయిన ఎమ్మెల్యే యువకునిపై చెంపదెబ్బలు కొట్టాడు.

Read Also: ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్‌ నిలిపివేయండి.. ఈసీకి ఫిర్యాదు

ఇక, ఎమ్మెల్యే గన్‌మెన్లు.. గులామ్​గౌస్ జిలానీని అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నటికి మరో సారి ఎమ్మెల్యే సదరు యువకుడిపై దాడి చేశారు. ఇదంతా ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే జరిగింది.. ఆ తర్వాత క్షణాల్లో పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి యువకులు చేరుకోవడంతో.. చార్మినార్​బస్టాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.. ఈ వ్యవహారం మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.. ఈ ఘటనలో బాధిత యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఎడమ చెవి దవడ భాగంలో గాయాలు అయినట్లు ఉస్మానియా వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. ఇక, ఈ ఘటనపై పోలీసులను ఆశ్రయించాడు బాధిత యువకుడు.. ఎమ్మెల్యే తనపై దాడి చేశారని.. తనను రివాల్వర్​తో షూట్​ చేస్తానని ఎమ్మెల్యే బంధువు బెదిరించాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఎంఐఎం చీఫ్, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ దృష్టికి కూడా ఈ వ్యవహారం వెళ్లినట్టుగా తెలుస్తోంది. మరోవైపు.. సీసీటీవీలో రికార్డ్ అయిన దాడి దృశ్యాలు సోషల్ మీడియాకు ఎక్కి హల్‌ చల్ చేస్తున్నాయి.. రాజకీయ విమర్శలు కూడా మొదలయ్యాయి.. మొత్తంగా ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Exit mobile version