ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 18న ప్రారంభమయ్యాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఉన్న నేపథ్యంలో మొదటి ఒక్కరోజే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనుకున్నారు. కానీ టీడీపీ నేతలు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని కోరడంతో దానిపై వైసీపీ సర్కార్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే రెండవ రోజు ఉద్రిక్తతల నడుమ సాగిన అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మూడవ రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి.
తాజాగా ఏపీ కేబినెట్ అత్యవసరంగా సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో మూడు రాజధానుల అంశంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఉన్న బిల్లును వెనక్కి తీసుకునే ఆలోచనలో జగన్ ప్రభుత్వం ఉన్నట్లు, కొన్ని మార్పులతో కొత్తగా సభలో మళ్లీ మూడు రాజధానుల బిల్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై అత్యవసర కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనిపై క్లారిటీ రావాలంటే ఏపీ కేబినెట్ సమావేశం వరకు వేచి చూడాల్సిందే.