టాలీవుడ్ లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా సాయి పల్లవి, ఫహద్ ఫాసిల్ జంటగా నటించిన ‘అథిరన్’ తెలుగు వెర్షన్ నిర్మాత అన్నపురేడి కృష్ణ కుమార్ నిన్న రాత్రి కన్నుమూశారు. సమాచారం ప్రకారం కృష్ణ కుమార్ గుండెపోటుతో వైజాగ్ లోని ఆయన నివాసంలో నిన్న రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలిసిన సినీ ప్రముఖులు ఆయన కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. కాగా ఫహద్ ఫాసిల్, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన మలయాళ చిత్రం ‘అథిరన్’. 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తెలుగులో “అనుకోని అతిథి”గా విడుదల చేస్తున్నారు. వివేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతుల్ కులకర్ణి, రెంజీ పానికర్, శాంతి కృష్ణ, ప్రకాష్ రాజ్, సురభి ముఖ్యమైన పాత్రలు పోషించారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో తెలుగులో డిజిటల్ గా రిలీజ్ కానుంది. మే 28నుంచి ప్రముఖ తెలుగు ఓటిటి వేదికపై స్ట్రీమింగ్ కానుంది. కృష్ణ కుమార్ నిర్మించిన ఈ చిత్రం మరో రెండ్రోజుల్లో విడుదల కానుండగా… ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధాకరం.