తవ్వకాల్లో బయటపడ్డ పురాతన నాణేలు.. ఎగబడ్డ జనం..

తవ్వకాల్లో బయటపడిన వస్తువులపై అందరికీ ఆసక్తి ఉంటుంది. అలాగే అవి ఎక్కడ బయటపడ్డాయని తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అయితే తాజాగా పురాతన నాణేలతో నిండిన కుండ ఒకటి బయట పడింది. ఎక్కడంటే మధ్య ప్రదేశ్‌లోని టికామ్‌ఘర్‌ జిల్లాలో. అయితే టికామ్‌ఘర్ పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో గల నందన్‌వారా గ్రామంలోని మట్టి క్వారీలో మంగళవారం ఉదయం జేసీబీతో మట్టిని తవ్వుతున్న సమయంలో ఒక కుండ కార్మికులకు కనిపించింది. దీంతో కార్మికులు ఆ కుండను బయటకు తీశారు. అందులో నాణెలు చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. పురాతన నాణేలతో కుండ బయటపడ్డ విషయం తెలియడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ జనాలు ఆ కుండను చూసేందుకు తరలివచ్చారు.

అప్పటికే కార్మికులు అధికారులుకు సమాచారం అందిచడంతో జిల్లా మైనింగ్ అధికారి ప్రశాంత్ తివారీ ఇతర అధికారులతో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుండలో 164 నాణేలు ఉన్నట్లు వాటిపై పర్షియన్ భాషలో నగిషీలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. అయితే నాణేలను అధ్యయనం చేయడానికి ఆర్కియాలజీ బృందం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో జిల్లా ట్రెజరీలో సీలు చేసిన కంటైనర్‌లో ఈ నాణేలను ఉంచినట్లు ఆయన వెల్లడించారు. అంతేకాకుండా కుండలో 12 వెండి నాణేలు ఉన్నాయని, మిగిలినవి రాగి ఉన్నాయని తివారీ తెలిపారు. గతంలో నందనవారా గ్రామానికి 55 కిలోమీటర్ల దూరంలో బుందేల్‌ఖండ్‌లోని ఓర్చా ప్రాంతం 16, 17వ శతాబ్దాలలో బలమైన ఆఫ్ఘన్, మొఘల్ పాలనలో ఉండేంది.