NTV Telugu Site icon

Top Headlines @ 5 PM: టాప్‌ న్యూస్‌

Top Headlines @ 5 Pm New

Top Headlines @ 5 Pm New

రాజధాని పనులకు ఎమ్మెల్సీ కోడ్..! ఈసీకి సీఆర్డీఏ లేఖ
గత ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని పనులు నిలిచిపోగా.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. మళ్లీ ఆ పనులను వేగవంతం చేసింది.. ఇప్పటికే పలు దఫాలుగా సమావేశం నిర్వహించిన.. కొన్ని పనులు చేపట్టింది.. ప్రాధాన్యతా క్రమంలో రాజధాని ప్రాంతంలో పనులు వేగవంతం చేసింది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీకోడ్ అడ్డంకిగా మారిపోయింది.. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల ఎమ్మెల్సీ స్థానంతో పాటు కృష్ణా – గుంటూరు జిల్లాలకు సంబంధించి రెండు గ్రేడ్యుయేట్ స్థానాలకు.. విశాఖ -విజయనగరం – శ్రీకాకుళం ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 27న పోలింగ్‌ జరగనుంది.. అయితే, రాజధాని పనులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిపోవడంతో.. కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసింది సీఆర్డీఏ. కేవలం గ్రేడ్యుయేట్ ఎన్నికలే కాబట్టి ఎన్నికల నియమావళి సడలించాలని సీఈసీని లేఖ ద్వారా కోరారు సీఆర్డీఏ అధికారులు. త్వరలోనే వరల్డ్‌ బ్యాంక్, ఏడీబీ రుణం మంజూరు కాబోతున్నాయి.. అయితే, పనుల ప్రాధాన్యత దృష్ట్యా ఇబ్బంది లేకుండా చూడాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది సీఆర్డీఏ.. వివిధ జోన్ల పరిధిలో 14 వేల కోట్ల విలువైన పనులు చేపట్టాం.. ఎల్పీఎస్ లే ఔట్లలో రోడ్లు.. మంచినీటి సరఫరా.. డ్రైన్లు.. విద్యుత్‌ ప్లాంటేషన్.. ఇలా కొన్ని పనులు మొదలు పెట్టాలని ఆలోచనలో ప్రభుత్వం ఉంది.. ఈ నేపథ్యంలో.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా మారిన నేపథ్యంలో.. ఈసీకి లేఖ రాసింది సీఆర్డీఏ..

జగన్‌ 2.0 వ్యాఖ్యలపై ఆదినారాయణరెడ్డి కౌంటర్‌ ఎటాక్.. బటన్‌ నొక్కి బటర్‌ మిల్క్‌ ఇచ్చారు..!
మళ్లీ అధికారంలోకి వస్తాం.. జగన్‌ 2.0 వేరుగా ఉంటుంది.. ఈసారి అధికారంలోకి వస్తే 30 ఏళ్లు మనదే పాలన ఉంటుందంటూ వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి.. వైఎస్‌ జగన్ ప్రతిపక్ష హోదా కోల్పోయారు… 30 ఏళ్ల నా పాలన, 175 /175 ఎమ్మెల్యే, 25/25 ఎంపీలు అనే వారు అంటూ ఎద్దేశా చేశారు.. ఇక, ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతోంది.. ఇక, ఏపీలో వికసిత భారత్ ద్వారా నీకు రాజకీయం లేకుండా చేస్తాం అంటూ హెచ్చరించారు.. నా వెంట్రుక కూడా పికలేరు అనుకుంటున్నారు.. అయితే, అభివృద్ధి ద్వారా నీకు భవిష్యత్ లేకుండా చేస్తాం అన్నారు.. నేను బటన్ నొక్కా.. బటన్ నొక్కా అని చెబుతున్న జగన్‌.. బటన్‌ నొక్కి ప్రజలకు బటర్ మిల్క్ ఇచ్చాడు అంటూ సెటైర్లు వేశారు. ఇక, వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో గుండెపోటు అన్నారు.. వైఎస్‌ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పోలీసులు వెళ్తే అడ్డుకున్నారు.. వైఎస్‌ జగన్ రెప్పకు దెబ్బతగిలితే అది హత్య, మీ చిన్నాను హత్య చేస్తే కనపడదా..? అంటూ నిలదీశారు ఆదినారాయణరెడ్డి.. జమ్మలమడుగులో మా గ్రామానికి చెందిన వ్యక్తి ఎదో చేస్తే అది నేను చేశాను అట… అసాంఘిక కార్యకలాపాలు చేయించే వ్యక్తిని చెప్పుతో కొడతా.. అంటూ హెచ్చరించారు.. నేనే పోలీసులులను అదేశించా… అసాంఘిక కార్యకలాపాలపై సమగ్ర విచారణ జరిపించాలని కోరాను అన్నారు.. నా కార్యకర్తలకు ఉద్యోగాలు కోసం పోరాడుతున్నాను.. అంతే తప్ప నేను పరిశ్రమలకు పెట్టే వారికి వ్యతిరేకంగా పని చేయలేదని స్పష్టం చేశారు.. వాల్తేరు డివిజన్ కాదని, విశాఖ కు రైల్వే డివిజన్ ఇచ్చాం.. దవోస్ లో చర్చలు జరిగాయి.. 10 వేల కోట్లతో కడపకు స్టీల్ ప్లాంట్ రాబోతోంది.. జగన్ ను ఏకాకిని చేస్తాం అన్నారు ఆదినారాయణరెడ్డి… జలజీవన్ మిషన్ కు భారీగా నిదులు తెచ్చాం… జగన్ సార్ ది పెద్ద అంగడి, అవినాష్, పెద్దిరెడ్డి, విజయ సాయి రెడ్డి వీళ్లది సూపర్ మార్కెట్, మిగిన వైసీపీ వారిది చిల్లర అంగడి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి..

జగన్‌పై అనగాని సెటైర్లు.. ఎమ్మెల్యేలను కూడా కలవలేదు.. కార్యకర్తలకు అండగా ఉంటారట..!
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కు పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి అంటూ కౌంటర్‌ ఎటాక్‌ చేశారు మంత్రి అనగాని సత్యప్రసాద్.. మోసం గురించి జగన్ చెప్తుంటే ఐదు కోట్ల ఆంధ్రులు పక్కున నవ్వేస్తున్నారన్న ఆయన.. తన ఐదేళ్ల పాలనలో వైఎస్‌ జగన్ చేసిన మోసాలను భరించలేకే జనం వేసిన మొట్టికాయకులకు ఇంకా వాపులు కూడా తగ్గలేదని.. ఆకాశంలో ఉన్న జగన్ అహంకారాన్ని ప్రజలు గత ఎన్నికల్లో అధ:పాతాళానికి తొక్కేశారు.. కానీ, ఇంకా మారని జగన్‌ను, ఆయన పార్టీని ఈసారి బంగళాఖాతంలో కలపడం ఖాయం అని జోస్యం చెప్పారు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను పీల్చి పిప్పి చేసి.. వారి సబ్ ప్లాన్ నిధులను మళ్లించి జేబులు నింపుకున్న జగన్ రెడ్డికి సంక్షేమంపై మాట్లాడే అర్హత లేదని ఫైర్‌ అయ్యారు.. జగన్ రెడ్డి.. కంపెనీలను బెదిరించి రాష్ర్టం నుండి వెళ్ల గొట్టి ఏపీ పరువును అంతర్జాతీయంగానూ తీసిన విషయం లూలూ, కియా కంపెనీల ఉదాంతాలే తెలుపుతున్నాయని వ్యాఖ్యానించారు.. అయితే, ఏపీ బ్రాండ్ ను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పున: నిర్మిస్తుండగా.. మరోవైపు వైఎస్‌ జగన్ అలవాటు ప్రకారం అమరావతిపై విషం కక్కుతున్నాడని ఆరోపించారు.. సీఎంగా ఉండగా కనీసం ఎమ్మెల్యేలను కూడా కలవని జగన్.. ఇప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటానంటే అది నమ్మేస్థితిలేకే పార్టీ మారుతున్నారని పేర్కొన్నారు మంత్రి అనగాని సత్యప్రసాద్..

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక నిర్ణయం
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన ప్రాభవాన్ని నిలబెట్టుకోవాలని, ప్రతీ స్థాయిలో విజయాన్ని సాధించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలకు స్పష్టమైన దిశానిర్దేశం ఇచ్చారు. ఈ నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్ఆర్డి (MCHRD)లో జరిగిన కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (CLP) సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి ఏఐసీసీ (AICC) రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో కాంగ్రెస్ బలాన్ని పెంపొందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఏకగ్రీవ విజయం సాధించే బాధ్యత ఎమ్మెల్యేలదేనని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు నిదర్శనంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం, ఆలయాల అభివృద్ధి, వివిధ నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేయడం, నిధుల కేటాయింపు కోసం తక్షణమే సంబంధిత మంత్రులను కలవాలని సూచించారు.

ఖర్గే, రాహులకు మంత్రి కొండా సురేఖ లేఖ
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గురువారం లేఖ రాశారు. ఇందులో ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ కులగణనను విజయవంతంగా చేపట్టిందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీసీల హక్కులను పరిరక్షించేందుకు, వారికి మరింత న్యాయం జరిగేలా ఈ సర్వే ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. బీసీ కులగణనను కార్యరూపంలోకి తెచ్చేందుకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కీలకంగా పనిచేశారని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి కట్టుబడి ఉందని, కామారెడ్డి డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రకటనల ప్రకారం ఈ బీసీ సర్వేను విజయవంతంగా అమలు చేయడం ఇందుకు నిదర్శనమని తెలిపారు.

కేంద్రమంత్రులను కలిసిన కేటీఆర్‌.. కీలక అంశాలపై చర్చ
బీఆర్ఎస్ పార్టీ తరఫున పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన కేసును కూడా ఫాలోఅప్ చేయనున్నట్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ విషయంలో కోర్టులో పోరాడతామని, తమ పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశమై తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంతేగాక, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, నితిన్ గడ్కరీలను కలుసుకుని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, భారతీయ విద్యా వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ప్రపంచవ్యాప్తంగా భారత పౌరులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించగలగడం దేశంలోని విశ్వవిద్యాలయాల మూలంగా కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం యూజీసీ నిబంధనల్లో చేయనున్న మార్పులపై తమ అభ్యంతరాలను కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించామని తెలిపారు.

అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవించలేదు.. ఇప్పుడు ఓట్ల కోసం జై భీమ్‌ అంటోంది..!
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీని మారోసారి టార్గెట్‌ చేశారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ చెప్పినదంతా.. కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకించేదని అన్నారు.. బీఆర్ అంబేద్కర్‌ ఆశయాలను కాంగ్రెస్ దుర్వినియోగం చేసిందని ఆరోపించారు, సామాజిక సంస్కర్త పట్ల ఆ పార్టీ దారుణంగా ప్రవర్తించిందన్నారు.. అంబేద్కర్‌ను కాంగ్రెస్‌ ఎప్పుడూ గౌరవించలేదు.. అంబేద్కర్‌ను ఓడించేందుకు కుట్రలు చేసిందని విమర్శించారు.. కానీ, ఇప్పుడు ఓట్ల కోసం జై భీమ్‌ నినాదాలు చేస్తోంది.. కాంగ్రెస్‌ రంగులు మార్చే పార్టీ అని దుయ్యబట్టారు.. ఎస్సీ, ఎస్టీల ఆర్థిక వెనుకబాటుతనాన్ని అంబేద్కర్‌ తొలగించాలని అన్నారు.. కానీ, కాంగ్రెస్ ఆ పని చేయలేకపోయిందన్నారు.. కాంగ్రెస్ బీఆర్ అంబేద్కర్‌తో దారుణంగా వ్యవహరించింది… వారు ఆయనను వ్యతిరేకించారు.. బాబాసాహెబ్ చెప్పినదంతా కాంగ్రెస్‌ను వ్యతిరేకించేది అని ప్రధాని మోడీ అన్నారు. ప్రతిదానికీ డాక్యుమెంట్స్‌ ఎవిడెన్స్‌ ఉన్నాయి.. వాటిని ధృవీకరించవచ్చన్న ఆయన.. ఎన్నికల్లో బాబాసాహెబ్ ఓడిపోయేలా కాంగ్రెస్ ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదన్నారు.. ఎందుకంటే వారు ఆయనను సహించలేకపోయారు… భారతరత్నకు ఆయన అర్హుడని భావించలేదు అంటూ ఫైర్‌ అయ్యారు.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై గురువారం రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని మోడీ సమాధానమిచ్చారు. సబ్ కా సాత్ కాంగ్రెస్‌కు సాధ్యం కాదు అని స్పస్టం చేశారు.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది కాంగ్రెస్ పార్టీకి అర్థం కాని విషయం అని పేర్కొన్నారు.. కాంగ్రెస్ విషయానికొస్తే… వారు సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ ఆశించడం పెద్ద తప్పు… అది వారి ఆలోచనలకు అతీతమైనది.. వారి రోడ్ మ్యాప్ కు కూడా సరిపోదు.. ఎందుకంటే అది ఒక పెద్ద పార్టీ.. ఒక రాజవంశానికి అంకితం చేయబడింది కాబట్టి.. వారికి సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సాధ్యం కాదు అని విమర్శించారు..

అభ్యర్థులకు రూ.15 కోట్ల ఆఫర్.. బీజేపీపై ఆప్ సంచలన ఆరోపణ
దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎగ్జిట్ పోల్స్ కూడా వచ్చేశాయి. 27 ఏళ్ల తర్వాత హస్తినలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలన్నీ తేల్చేశాయి. ఇదిలా ఉంటే తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ.. బీజేపీపై సంచలన ఆరోపణలు చేసింది. ఆప్ అభ్యర్థులకు బీజేపీ నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఏడుగురు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులకు ఒక్కొక్కరికీ రూ.15 కోట్లు ఆఫర్ చేశారని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఆప్‌ను విచ్ఛన్నం చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఏడుగురి పేర్లు మాత్రం సంజయ్ సింగ్ వెల్లడించలేదు గానీ… ఫోన్ కాల్స్ వచ్చినట్లుగా సంజయ్ సింగ్ వెల్లడించారు. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. బుధవారం (ఫిబ్రవరి 5) పోలింగ్ జరిగింది. మొత్తం 60 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి మాత్రం బీజేపీ అధికారంలోకి రాబోతుందని సర్వేలు తేల్చాయి. అయితే ఈ సర్వేలను ఆప్ తోసిపుచ్చింది. గతంలో కూడా ఎప్పుడూ ఆప్ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెప్పలేదని.. కానీ అధికారంలోకి వచ్చామన్నారు. ఇప్పుడు కూడా సర్వేలు అవే చెబుతున్నాయని.. కానీ అధికారంలోకి వచ్చేది మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ శనివారం ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి కూడా కాంగ్రెస్‌కు జీరో సీట్లే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి.

మధ్యప్రదేశ్‌లో కూలిన యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లకు గాయాలు
మధ్యప్రదేశ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. శివపురి సమీపంలో భారత వైమానిక దళానికి చెందిన మిరాజ్ 2000 యుద్ధ విమానం కూలిపోయింది. రెండు సీట్లు కలిగిన ఈ విమానం శిక్షణలో ఉండగా ప్రమాదవశాత్తు పచ్చని పొలాల్లో కూలిపోయింది. చాకచక్యంగా ఇద్దరు పైలట్లు తప్పించుకున్నారు. గాయపడ్డ పైలట్లను ఆస్పత్రికి తరలించారు. విమానం మాత్రం కాలి బూడిదైంది. అయితే సమీపంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి.. మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం సోషల్ మీడియలో పోస్టు చేయగా… వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఈ విమాన ప్రమాదంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఇద్దరు పైలట్లు సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఆదేశించారు. మిరాజ్ 2000ని ఫ్రాన్స్‌కు చెందిన డసాల్ట్ ఏవియేషన్ నిర్మించింది. 1978లో తొలిసారిగా ఎగిరింది. 1984లో ఫ్రెంచ్ వైమానిక దళం దీనిని ప్రవేశపెట్టింది. 600 మిరాజ్ 2000లను ఉత్పత్తి చేశారు. వీటిలో 50 శాతం భారతదేశంతో సహా ఎనిమిది దేశాలకు ఎగుమతి చేసినట్లుత డస్సాల్ట్ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

ఆర్బీఐ పాలసీ ఎఫెక్ట్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలతో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ.. శుక్రవారం ఆర్బీఐ పాలసీ వెలువడనుంది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం నుంచి కూడా సూచీలు ఒడిదుడుకులు ఎదుర్కొంటూనే ఉంది. చివరికి నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్ 213 పాయింట్లు నష్టపోయి 78, 058 దగ్గర ముగియగా.. నిఫ్టీ 92 పాయింట్లు నష్టపోయి 23, 603 దగ్గర ముగిసింది. ఇక రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 87.57 దగ్గర సరికొత్త కనిష్ట స్థాయిలో ముగిసింది. నిఫ్టీలో భారత్ ఎలక్ట్రానిక్స్, భారతీ ఎయిర్‌టెల్, టైటాన్ కంపెనీ, ఎన్‌టీపీసీ అత్యధికంగా నష్టపోగా.. సిప్లా, అదానీ పోర్ట్స్, ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, టాటా కన్స్యూమర్ లాభపడ్డాయి. రంగాలలో ఫార్మా, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్ మినహా మిగతా అన్ని రంగాల సూచీలు ఆటో, ఎఫ్‌ఎంసిజి, రియాల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1-2 శాతం మధ్య పడిపోయాయి. మెటల్, పీఎస్‌యు బ్యాంక్, ఎనర్జీ, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్ 0.4-0.8 శాతం క్షీణించాయి.

నానో కంటే మరో చిన్న కారు.. ఊపు ఊపేయడానికి వస్తున్న ఈవీ
వియత్నాం ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు విన్‌ఫాస్ట్ (VinFast).. 2025 జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో అనేక వాహనాలను ప్రదర్శించింది. ఇందులో విన్‌ఫాస్ట్ VF 6, విన్‌ఫాస్ట్ VF 7లను కూడా ప్రవేశపెట్టింది. వీటిని 2025 పండుగ సీజన్‌లో భారతదేశంలో ప్రారంభించవచ్చు. అలాగే.. కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ కారు విన్‌ఫాస్ట్ VF 3ను 2026లో భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. ఈ కారు టాటా నానో కంటే చిన్నగా కనిపిస్తుంది.. కానీ నలుగురు వ్యక్తులు ఇందులో హాయిగా ప్రయాణించవచ్చు. అయితే.. విన్‌ఫాస్ట్ VF 3 గ్లోబల్ స్పెక్ ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం… విన్‌ఫాస్ట్ VF 3 MG కామెట్ EV లాగా బాక్సీ డిజైన్‌లో ఉంటుంది. ఇరువైపులా రెండు డోర్లను కలిగి ఉంటుంది. ఇది బ్లాక్ క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్, హాలోజన్ హెడ్‌లైట్లతో క్రోమ్ బార్‌ను కలిగి ఉంటుంది. ఈ కారులో ముందు పూర్తిగా నల్లగా, వెనుక బంపర్లతో.. బాడీ క్లాడింగ్ కూడా అందించనున్నారు. ముందు, వెనుక భాగంలో బ్లాక్-అవుట్ విభాగం ఉంటుంది. హాలోజన్ టెయిల్ లైట్లతో కూడి క్రోమ్ బార్ కూడా ఉంటుంది.

నితిన్ ‘ఎల్లమ్మ’ పూజా కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్
బలగం సినిమాతో దర్శకుడిగా మారి తోలి ప్రయత్నంలోనే సూపర్ హిట్ కొట్టి బలగం వేణుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2023 లో విడుదలైన ఈ సినిమా ప్రశంసలతో పాటు కాసుల వర్షం కురిపించింది . వేణు ఈ చిత్రానికి గాను జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ అయి చాలా కాలం అవుతున్నా కూడా మరో సినిమాను పట్టాలెక్కించలేదు ఈ దర్శకుడు. బలగం సినిమాను నిర్మించిన దిల్ రాజు బ్యానర్ లోనే తన రెండవ సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ కథ అందరి చుట్టూ తిరిగి ఫైనల్ గా యంగ్ హీరో నితిన్ దగ్గరకు వచ్చి చేరింది. పలు మార్పులతో మొత్తానికి ఈ సినిమా అక్కడ ఓకే అయింది. ఈ కథకు నిర్మాత దిల్ రాజు ఇప్పటికే యల్లమ్మ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసి ఉంచారు. ప్రస్తుతం నితిన్ చేస్తున్నరాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలు చివరి దశ షూట్ లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు నితిన్. కాగా ఈ సినిమాను ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ లో ముహూర్తం పూజ ఉండనుందట. ఏప్రిల్ లేదా మే నుండి షూటింగ్ మొదలు కానుంది.

పిల్లల్ని కనే విషయంలో ఆధునికతను అనుసరించండి : ఉపాసన
ఈ మధ్యకాలంలో పిల్లలను కనడం అనేది పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు. అప్పట్లో పది మంది పిల్లలను ఎంతో ఈజీగా కనేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని కనడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా లెట్ మ్యారేజ్ వల్లు ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఎగ్ ఫ్రీజింగ్‌ స్టార్స్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. పిల్లల కోసం అండాన్ని దాచుకోవ‌డం.. దీనినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు. అంటే యుక్త వ‌య‌సులో అండాన్ని ఫ్రీజ్ చేయడం అని అర్ధం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది అత్యవ‌స‌రం అని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయం పైనే తాజాగా ఉపాసన కొణిదెల ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో ప్రస్థావించింది. ‘పిల్లలను కనే విషయంలో మహిళలు ముందు చూపుతో ఉండాలి. ఇప్పుడే పిల్లల్ని క‌నాల‌నుకోని దంప‌తుల‌కు ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఆప్షన్. ఆధునిక‌త‌ను అనుస‌రించ‌డం త‌ప్పేమీ కాదు. ఫ్యూచర్ లో పిల్లల‌ను క‌నాలంటే యుక్తవ‌య‌సు ద‌శ‌లోనే ఎగ్ ఫ్రీజింగ్ చేయాల‌నే ప్రయ‌త్నం మంచిది’ అని ఉపాస‌న వెల్లడించింది.ఇంత‌కుముందు ఇదు మృణాల్ ఠాకూర్, మెహ్రీన్ కౌర్ పిర్జాదా వంటి సెల‌బ్రిటీలు కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో మ‌ద్ధతుగా మాట్లాడారు.