ట్విట్టర్ లో తరచూ వివాదాస్పద ట్వీట్స్ చేసే స్వరా భాస్కర్ మరోసారి కాంట్రవర్సీలో చిక్కింది. ఆమెతో పాటూ ట్విట్టర్ ఇండియాపై, మరికొందరిపై ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కారణం… ఓ వీడియో. ‘ఘజియాబాద్ దాడి వీడియో’గా సొషల్ మీడియాలో నెటిజన్స్ మాట్లాడుకుంటోన్న క్లిప్పింగ్ లో ఓ ముస్లిమ్ వ్యక్తి తనపై దాడి జరిగిందన్నాడు. ‘జై శ్రీరామ్’ అననందుకు తనని కొట్టారనీ, బలవంతంగా గడ్డం కొరిగించారనీ ఆరోపించాడు. అయితే, ఆయన మాటల్ని వెనుకా ముందు ఆలోచించకుండా స్వరా భాస్కర్ తో సహా చాలా మంది షేర్ చేశారు. హిందూ, ముస్లిమ్ సమస్యగా అభివర్ణించారు. కానీ, పోలీసులు మాత్రం… దాడికి గురైన బాధితుడు, కంప్లైంట్ లో ఎక్కడా, తన చేత బలవంతంగా ‘జై శ్రీరామ్’ అనిపించినట్టు చెప్పలేదంటున్నారు. అలాగే, ఎఫ్ఐఆర్ లో బాధితుడు తన అభిమతానికి వ్యతిరేకంగా గడ్డం తీయించినట్టు కూడా ఆరోపించలేదు. దాంతో ఘజియాబాద్ లో జరిగింది వ్యక్తుల మధ్య గొడవే తప్ప హిందూ, ముస్లిమ్ విభేదాలు కావని పోలీసులు చెబుతున్నారు.
స్వరా భాస్కర్, మరికొంత మంది షేర్ చేసిన వీడియోలోని ఆరోపణలు తప్పు అంటూ పోలీసులు చెప్పటంతో ఓ లాయర్ కేసు కంప్లైంట్ చేశాడు. ఆయన వాదన ప్రకారం స్వరా భాస్కర్, ఇతరులు, ట్విట్టర్ ఇండియా హెడ్ మనీశ్ మహేశ్వరీ… వీళ్లంతా తప్పుడు సమాచారం లక్షలాది మంది ఫాలోయర్స్ కి అందిస్తూ మతాల నడుమ కలహాలకి కారణమయ్యారని. అలాగే, ఏ కొంచెం అనుమానం వచ్చినా ‘మ్యానిపులెటెడ్ మీడియా’ అంటూ ట్యాగ్ చేసే ట్విట్టర్ స్వర భాస్కర్ షేర్ చేసిన వీడియోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే, ట్విట్టర్ పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు దారుడు పోలీసుల్ని కోరాడు. పోలీసులు ప్రస్తుతం స్వరాతో సహా ట్విట్టర్ ఇండియాపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు!
‘ఆ వీడియో’ షేర్ చేసినందుకు స్వరా భాస్కర్ పై కేసు!
