NTV Telugu Site icon

వైఎస్‌ షర్మిల భావోద్వేగం.. ఒంటరినైపోయా.. కన్నీరు ఆగనంటుంది..!

వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి, వైఎస్ కూతురు వైఎస్‌ షర్మిల భావోద్వేగ ట్వీట్ చేశారు.. వైఎస్సార్‌ను సోషల్ మీడియా వేదికగా స్మరించుకున్న షర్మిల… “ఒంటరి దానినైనా విజయం సాధించాలని, అవమానాలెదురైనా ఎదురీదాలని, కష్టాలెన్నైనా ధైర్యంగా ఎదురుకోవాలని, ఎప్పుడూ ప్రేమనే పంచాలని, నా వెన్నంటి నిలిచి, ప్రోత్సహించి, నన్ను మీ కంటిపాపలా చూసుకొన్నారు. నాకు బాధొస్తే మీ కంట్లోంచి నీరు కారేది.. ఈ రోజు నా కన్నీరు ఆగనంటుంది.. I Love & Miss U DAD” అంటూ ట్వీట్‌ చేశారు వైఎస్‌ షర్మిల. అయితే, వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూనే.. తెలంగాణలో పార్టీ పెట్టి ఒంటరిగా పోరాటం చేస్తున్న ప్రస్తుత తన పరిస్థితిని కూడా.. తన ట్వీట్లో వైఎస్‌ షర్మిల రాసుకొచ్చినట్టు కనబడుతోంది.. మరోవైపు.. ఇవాళ వైఎస్సార్‌ ఫ్యామిలీ మొత్తం ఇడుపులపాయలోని ఆయన సమాధి దగ్గర నివాళులర్పించింది.. వైఎస్‌ షర్మిల వస్తుందా? లేదా? వైఎస్‌ జగన్‌తో ఆమె ఎలా మెలుగుతుంది అనే చర్చ సాగినా.. నివాళులర్పించేసమయంలో.. ప్రత్యేక ప్రార్థన సమయంలోనూ వైఎస్‌ జగన్ చెంతే ఉన్నారు షర్మిల.