ప్రగతి భవన్‌లో కుస్తీ ఫైటింగ్‌ జరుగుతోంది: విజయశాంతి

కేసీఆర్‌ కుటుంబంలో ముఖ్యమంత్రి స్థానంకోసం యుద్ధం మొదలైందన్నారు బీజేపీ నేత విజయశాంతి.. టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించిన ఆమె.. ప్రగతి భవన్‌లో కుస్తీ ఫైటింగ్‌ జరుగుతుందన్నారు. కుటుంబ పంచాయతీలతో కేసీఆర్‌ తల పట్టుకున్నాడని విజయశాంతి అన్నారు. భవిష్యత్‌లో తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ఉండబోదని జోస్యం చెప్పిన రాములమ్మ.. కేసీఆర్ మోసపు విధానాలు అవలంభిస్తున్నారన్నారు. కేసీఆర్‌ మాటలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. కుటుంబ కొట్లాటల నుంచి రిలీఫ్ కోసం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు.

కేసీఆర్ గురించి పీహెచ్‌డీ చేశాను ఆయన ఏది చెప్తాడో అది చేయడు. కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు స్టేఫ్నీ .. ఆ పార్టీని తన అవసరాల కోసం వాడుకుంటాడని విజయశాంతి అన్నారు. టీఆర్ఎస్‌కు సీట్లు తక్కువ పడితే ఆ పార్టీ సీట్లు వాడుకుంటాడు. టీఆర్ఎస్.. కాంగ్రెస్.. ఎంఐఎంలు మూడు ఒక్కటేనని ఆమె తెలిపారు. నేను ఎక్కడా పోటీ చేయాలన్నది ఇంకా నిర్ణయించుకోలేదన్నారు రాములమ్మ. కేసీఆర్‌పై ఖచ్చితంగా విచారణ ఉంటుంది. ఆయన బాగోతాలు త్వరలోనే బయటపడతాయన్నారు.. ఇతర పార్టీల నేతలు సైతం మాతో టచ్‌లో ఉన్నారు. కేసీఆర్‌ ఎన్ని డ్రామాలు వేసినా వ్యర్థప్రయాస అన్నారు. ప్రజలు కేసీఆర్‌కు త్వరలోనే సరైన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.