Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..

  • విశాఖ, హైదరాబాద్‌ సహా ఐదు ప్రాంతాల్లో ఈడీ సోదాలు
  • రూ.1.01 కోట్ల నగదు, కీలక పత్రాలు సీజ్
  • 182 బ్యాంకు ఖాతాలు, 6 లగ్జరీ వాహనాలు ఫ్రీజ్
  • వేలాది మంది నుంచి రూ.2,000 కోట్లకు పైగా వసూళ్లు
Chit Fund Scam

Chit Fund Scam

Chit Fund Scam: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మల్టీ-క్రోర్ చిట్‌ఫండ్, రియల్ ఎస్టేట్ స్కామ్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఉక్కుపాదం మోపింది. వెల్ఫేర్ బిల్డింగ్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన కార్యాలయాలతో పాటు సంస్థ డైరెక్టర్లు మల్ల విజయ ప్రసాద్, వరహ రామకృష్ణ సత్య శ్రీనివాసరావు అల్లా ఇళ్లపై విరుచుకుపడింది. విశాఖపట్నం, హైదరాబాద్‌లతో సహా మొత్తం ఐదు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో రూ.1.01 కోట్ల సముపార్జన నగదు, కీలక ఆస్తి పత్రాలు, డిజిటల్ పరికరాలను సీజ్ చేసింది. అలాగే సంస్థకు చెందిన 182 బ్యాంకు ఖాతాలను, 6 లగ్జరీ వాహనాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.

రూ.2,000 కోట్ల డిపాజిట్ల గోల్‌మాల్.. పలు రాష్ట్రాల్లో మోసాలు

రియల్ ఎస్టేట్, డిపాజిట్ సమీకరణ పథకాల పేరుతో ఈ సంస్థ వేలాది మంది ప్రజల నుంచి ఏకంగా రూ.2,000 కోట్లకు పైగా నిధులు సేకరించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. విశాఖపట్నంలో భూములు ఇస్తామంటూ ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్ తదితర రాష్ట్రాల ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారు. ఆ తర్వాత బ్రాంచ్ ఆఫీసులను మూసివేసి బోర్డు తిప్పేశారు. కొత్త పెట్టుబడిదారుల డబ్బుతో పాతవారికి చెల్లిస్తూ, మిగిలిన నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు మళ్లించినట్లు గుర్తించారు. విభిన్న పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా పిఎంఎల్‌ఎ (PMLA) చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసింది.