Wasim Akram Names Suryakumar Yadav As Dangerous Batsman For Pakistan: ఆగస్టు 27వ తేదీ నుంచి దుబాయ్ వేదికగా ఆసియా కప్-2022 ప్రారంభం అవుతున్న తరుణంలో.. ఆ తర్వాతి రోజు జరగనున్న భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుందా? అని ఆసక్తిగా ఉన్నారు. ఇదే సమయంలో.. చాలాకాలం నుంచి ఫామ్లేమితో సతమతమవుతున్న విరాట్ కోహ్లీ.. ఈ మ్యాచ్తో తిరిగి ఫామ్లోకి వస్తాడని అంతా అనుకుంటున్నారు. అతను పాక్పై ప్రతాపం చూపడం ఖాయమని భావిస్తున్నారు. ఫ్యాన్స్ దగ్గర నుంచి మాజీల దాకా.. అందరూ కోహ్లీ మీదే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు.
అయితే.. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ మాత్రం సూర్యకుమార్ యాదవ్పై మగ్గు చూపాడు. కోహ్లీ, రోహిత్, రాహుల్ కన్నా అతడు అత్యంత ప్రమాదకరమైన బ్యాట్స్మన్ అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు.. ఆసియాకప్లో పాకిస్తాన్కు చుక్కలు చూపించే సత్తా అతనికి ఉందని అభిప్రాయపడ్డాడు కూడా! ‘‘అఫ్కోర్స్.. టీమిండియాలో కోహ్లీ, రోహిత్, రాహుల్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారు. కానీ.. ప్రస్తుతం టీ20లో నాకు ఇష్టమైన ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. అతడిప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్నాడు. అతడ్ని ఐపీఎల్లో తొలిసారిగా కోల్కతా నైట్ రైడర్స్ తరపున ఆడినప్పుడు చూశాను. ఆ సీజన్లో సూర్య కొన్ని మ్యాచుల్లో ఏడెనిమిది స్థానాల్లో వచ్చాడు. అప్పుడు అంతగా రాణించకపోయినా..అతని షాట్స్ మాత్రం అసాధారణమైనవి. ఫైన్ లెగ్ దిశగా సూర్యలా షాట్లు ఆడడం చాలా కష్టం’’ అని వసీమ్ అన్నాడు.
కాగా.. వసీమ్ అక్రమ్ చెప్పినట్టు ఈమధ్య సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఇంగ్లండ్, విండీస్లతో జరిగిన టీ20 సిరీస్లలో అతడు దుమ్మురేపాడు. ఇప్పటివరకు 23 టీ20 మ్యాచ్లు ఆడిన సూర్య.. 672 పరుగులు సాధించాడు. అందులో ఒక సెంచరీ కూడా ఉంది. అంతేకాదు.. టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో బాబర్ ఆజమ్ తర్వాత సూర్య రెండో స్తానంలో ఉన్నాడు.
