తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్ అయిన గ్రేటర్ వరంగల్ (GWMC) పాలన ప్రస్తుతం గందరగోళంగా మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున 30 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసినప్పటికీ, వరంగల్ మున్సిపల్ కమిషనర్ పోస్టును మాత్రం భర్తీ చేయకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు నగరం వేగంగా విస్తరిస్తున్నా, పూర్తిస్థాయి బాస్ లేకపోవడంతో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి.
ప్రస్తుతం హనుమకొండ జిల్లా కలెక్టర్గా ఉన్న షాహత్ బాజ్పాయి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దీనికి తోడు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) వైస్ చైర్ పర్సన్ బాధ్యతలను కూడా ఆమెకే అప్పగించారు. ఇలా ఒకే అధికారి మూడు కీలకమైన పోస్టులను పర్యవేక్షించాల్సి రావడంతో పాలనపై పట్టు తప్పుతోందని, ప్రజల సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి.
ఇంతటి కీలకమైన పోస్టును ఖాళీగా ఉంచడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐఏఎస్ అధికారుల బదిలీల జాబితాలో వరంగల్కు కమిషనర్ వస్తారని అందరూ ఆశించినా, ప్రభుత్వం మాత్రం ఆ ఊసే ఎత్తలేదు. జిల్లాలో కీలక పోస్టులో ఉన్న ఒక అధికారికి ప్రభుత్వ పెద్దలతో ఉన్న సంబంధాల కారణంగానే ఈ నియామకం వాయిదా పడుతోందనే గుసగుసలు రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
సుమారు 11 లక్షల జనాభా కలిగిన వరంగల్ వంటి నగరానికి నిరంతరం పర్యవేక్షణ చేసే పూర్తిస్థాయి కమిషనర్ అవసరం ఎంతైనా ఉంది. ఇంచార్జీల పాలన వల్ల పర్యవేక్షణ లోపించి నగరంలో మౌలిక వసతుల కల్పన మందగించిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఓరుగల్లు బల్దియాకు పూర్తిస్థాయి బాస్ను ఎప్పుడు నియమిస్తుందో వేచి చూడాలి.
